హైదరాబాద్ వాసికి రష్యాలో నరకం.. బలవంతంగా యుద్ధ రంగం లోకి

Updated on: Oct 19, 2025 | 10:21 AM

మంచి ఉద్యోగం, మెరుగైన ఆదాయం కోసం రష్యా వెళ్లిన హైదరాబాద్ వాసికి ఊహించని కష్టం ఎదురైంది. ఉద్యోగం పేరుతో వెళ్లిన అతడిని రష్యా సైన్యం బలవంతంగా ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధానికి పంపింది. ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా, రష్యాలో ఇరుక్కుపోయిన తన భర్తను రక్షించాలంటూ, బాధితుడి భార్య కేంద్ర విదేశాంగ శాఖను ఆశ్రయించడంతో ఈ విషయం బయటపడింది.

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌కు చెందిన 37 ఏళ్ల మహమ్మద్ అహ్మద్ స్థానికంగా బౌన్సర్‌గా పనిచేసేవాడు. మెరుగైన ఉపాధి అవకాశాల కోసం ముంబైకి చెందిన ఓ ఏజెంట్‌ను సంప్రదించాడు. ఆ ఏజెంట్ మాటలు నమ్మి ఈ ఏడాది ఏప్రిల్ 25న రష్యాకు వెళ్లాడు. అయితే, అక్కడికి వెళ్లాక ఆ ఏజెంట్ తరపున ప్రతినిధి.. అతడిని మోసం చేసి రష్యా సైన్యానికి అప్పగించారు. అహ్మద్‌తో పాటు మరో 30 మందిని ఒకచోటుకు చేర్చిన రష్యా సైన్యం.. వారందరికీ కొన్ని రోజుల పాటు సైనిక శిక్షణ ఇచ్చింది. తర్వాత ఉక్రెయిన్‌తో యుద్ధం చేయాలంటూ అహ్మద్‌తో పాటు 26 మందిని ఆదేశించటమే గాక. వారిని నేరుగా.. ఇటీవలే ఉక్రెయిన్ బోర్డర్‌కు తరలించింది. మార్గమధ్యంలో రష్యా సేనల బారి నుంచి తప్పించుకునేందుకు అహ్మద్ వాహనం నుంచి కిందికి దూకగా, అతడి కాలు విరిగింది. ప్రస్తుతం రష్యా ఆర్మీ పర్యవేక్షణలోనే అతడు చికిత్స పొందుతున్నాడు. ఇటీవల తన భార్య ఫిరదౌస్ బేగంకు ఫోన్ చేసిన అహ్మద్ తన దయనీయ పరిస్థితిని వివరించాడు. తనతో పాటు శిక్షణ తీసుకున్న 30 మందిలో ఇప్పటికే 17 మంది యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశాడు. “యుద్ధంలో పాల్గొనకపోతే ప్రాణాలు తీస్తామని రష్యా సైన్యం భయపెడుతోంది” అని తన భర్త చెప్పినట్లు ఫిరదౌస్ తెలిపారు. తన భర్తను సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బంగారం ధరను ప్రభావితం చేసిన ట్రంప్ వ్యాఖ్యలు

H-1B వీసా ఫీజులపై న్యాయపోరాటం

ఆ ఊరి పేరే దీపావళి.. ఆ గ్రామ ప్రత్యేక ఏంటో తెలుసా ??

అత్తామామలను రెండు పీకి.. కట్‌ చేస్తే.. భర్తను భార్య ఏమి చేసిందంటే

త్వరలో ఆ 4 ప్రభుత్వ బ్యాంకుల విలీనం