ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. రాష్ట్రమంతటా భారీగా నగదు పట్టుబడటం జరుగుతోంది. పోలీసులు ఎక్కడికక్కడ చెక్పోస్టులు పెట్టి ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇటీవల విశాఖ పోలీసులు రూ. కోటిపైగా నగదును సీజ్ చేశారు. భారీ మొత్తంలో డబ్బు రవాణా జరుగుతోందని ద్వారకా నగర్ పోలీసులకు పక్కా సమాచారం అందటంతో.. స్థానికంగా చెక్పోస్ట్ ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఓ ఇద్దరు వ్యక్తులు స్కూటీపై అటు రాగానే.. వారిపై అనుమానమొచ్చి చెక్ చేశారు. సరైన డాక్యుమెంట్స్ లేకుండా రూ. కోటి నగదు స్కూటీలో తరలిస్తున్నట్టు గుర్తించారు. దీంతో ఆ డబ్బును సీజ్ చేసి.. వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాగా, ఆ ఇద్దరి వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.