Vizag Food Fest 2025: ఆహా.. ఏమి రుచిరా!.. ఫుడ్ లవర్స్‌కు పండగే పండగ..

Updated on: Sep 07, 2025 | 12:06 PM

వైజాగ్‌ వాసులు ఇప్పుడు.. ఆహా ఏమి రుచి.. తినరా మైమరిచి అంటున్నారు. పసందైన వంటకాలను రుచిచూస్తూ తన్మయత్వంలో మునిగితేలుతున్నారు. వైజాగ్‌ గ్రాండ్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌లో నచ్చిన ఐటెమ్‌ను తింటూ ఎంజాయ్‌ చేస్తు్న్నారు. ఒకటారెండా.. వందల రకాల ఫుడ్‌ ఐటెమ్స్‌.. దేశీయ వంటకాలతోపాటు విదేశీ రుచుల్ని అందిస్తుండటంతో ఫుడ్‌ ఫెస్టివల్‌కి క్యూకడుతున్నారు జనం.

వైజాగ్‌ అంటే ఎవ్వరికైనా గుర్తొచ్చేది బీచ్‌.. పచ్చదనం.. చల్లని గాలులు.. ప్రకృతి సోయగం.. అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో పసందైన వంటకాలు తింటుంటే ఎలా ఉంటుంది.. ఎవ్వరైనాసరే.. ఆహా ఏమిరుచి.. తినరా మైమరిచి అని అనాల్సిందే.!. ఇప్పుడు వైజాగ్‌ వాసులు.. అలాంటి అనుభూతినే పొందుతున్నారు. వైజాగ్‌ వుడా పార్క్‌ ఎంజీఎం మైదానంలో ఏర్పాటుచేసిన ఫుడ్‌ ఫెస్టివల్‌లో వివిధ రకాల వంటకాలను టేస్ట్‌చేస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఏపీ టూరిజం, ఏపీ హోటల్స్‌ అండ్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ఈ ఫుడ్‌ ఫెస్టివల్‌కి ఊహించని స్పందన వస్తోంది.

వైజాగ్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌లో ప్రముఖ స్టార్‌ హాటల్స్‌, సాధారణ హోటల్స్‌ కలిపి 40వరకు స్టాల్స్‌ ఏర్పాటు చేశాయి. ఇక్కడ ప్రపంచ వంటకాలతోపాటు సిగ్నేచర్‌ డిషెస్‌, ఆంధ్రా రుచులు, కాంబినేషన్‌ ఫుడ్స్‌ని రీజనల్‌ రేట్స్‌కి అందిస్తున్నారు. స్మూతీస్, ఐస్‌క్రీమ్స్, స్నాక్స్, మెయిన్ కోర్స్, వెజ్, నాన్‌వెజ్ వంటకాలు తినేవారికి తిన్నంత అన్నట్టు బోలెడన్ని వెరైటీస్ ఉన్నాయి. ఈట్ ఏషియన్, రుచిరా పేరుతో ఏర్పాటుచేసిన స్టాల్‌కి అనూహ్య స్పందన లభిస్తోంది. బిర్యానీతోపాటు సూషీస్ ఇక్కడ స్పెషల్. వెజ్-నాన్‌వెజ్ సుషీస్‌తో పాటు దిమ్సం, అప్పటైజర్, బావ్ లాంటి వెరైటీస్.. ఫుడ్ లవర్స్ మనసు దోచుకుంటున్నాయి.