ఆకాశమంత ఎత్తులో ఆగిన ఊపిరి.. చెట్టుపైనే వేలాడుతూ..
రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లెల్లలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. నిరుపేద గీత కార్మికుడు సాయిలి కిషన్ కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. కాలు జారకుండా కట్టుకున్న మోకుతో గాలిలోనే వేలాడుతూ మృతి చెందడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గీత కార్మికుల దుర్భర బతుకులకు ఈ ఘటన దర్పణం పడుతోంది.
రెక్కాడితే గానీ డొక్కాడని బతుకు వారిది. ప్రతిరోజూ సూర్యుడు ఉదయించకముందే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఆకాశమంత ఎత్తున ఉన్న తాటిచెట్లను ఎక్కుతారు. కానీ, ఆ తాటిచెట్టే తన పాలిట మృత్యుపాశం అవుతుందని, తన ప్రాణం గాలిలోనే కలిసిపోతుందని ఆ కార్మికుడు ఊహించలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో జరిగిన ఈ సంఘటన చూపరుల కళ్లు చెమ్మగిల్లేలా చేసింది. జిల్లెల గ్రామానికి చెందిన సాయిలి కిషన్ నిరుపేద గీత కార్మికుడు. ప్రతిరోజూలాగే కుటుంబ పోషణ కోసం కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కాడు. చెట్టుపై పనిలో ఉండగానే విధి వంచించింది. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కిషన్ స్పృహ కోల్పోయాడు. కాలు జారి కిందపడకుండా కట్టుకున్న మోకుఅతడిని గాలిలోనే ఆపేసింది. ఫలితంగా కిషన్ చెట్టుపైనే తలకిందులుగా వేలాడుతూ కన్నుమూశాడు. కింద ఉన్నవారు గమనించేలోపే జరగకూడని నష్టం జరిగిపోయింది. గాలిలో వేలాడుతున్న కిషన్ మృతదేహాన్ని చూసి గ్రామం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. అగ్నిమాపక సిబ్బంది మరియు పోలీసులు వచ్చి మృతదేహాన్ని కిందకు దించే వరకు ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. “ఉదయం క్షేమంగా వెళ్లిన మనిషి.. ఇలా గాలిలో శవమై కనిపిస్తాడా?” అంటూ భార్యాపిల్లలు గుండెలు పగిలేలా విలపించడం అక్కడి వారిని కలచివేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పాపికొండల విహార యాత్రలో ఒక్కసారిగా కలకలం.. ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు
విజయం సాధించాలని గణనాథుడిని ప్రార్థించిన టీమిండియా
మేడారం హుండీలో చిత్ర విచిత్రమైన కోరికలు.. చదివి షాకవుతున్న సిబ్బంది