వీడియోలో బంగారం చూపించిన యూట్యూబర్.. చోరీ చేసిన దొంగ‌లు..!

Updated on: Jun 11, 2026 | 11:17 AM

బంగారం, వెండి వస్తువులను చూపించిన యూట్యూబర్ ఇంటిపై దొంగ‌లు పడ్డారు. లక్షల విలువైన బంగారాన్ని, నగదును దోచుకెళ్లారు. అర్థరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు యూట్యూబర్ కుటుంబ సభ్యులను బంధించి చోరీకి పాల్పడ్డారు. మధ్యప్రదేశ్ శివపురి జిల్లాలో ఈ ఘటన జరిగింది. సెలబ్రిటీలు, నెటిజన్లు తమ ఇన్‌స్టా అకౌంట్‌లలో హోం టూర్లు, డైలీ రొటీన్‌, విలాసవస్తువులను షేర్ చేస్తుంటారు. అలాగే ఓ యూట్యూబర్ తన బంగారు నగలను యూట్యూబ్‌లో ప్రదర్శించి, దొంగలబారిన పడింది. సోషల్ మీడియాలో బంగారు ఆభరణాలు, నగదు, విలాసవంతమైన జీవనశైలిని ప్రదర్శించి ఆమె ప్రమాదాన్ని కొనితెచ్చుకుంది.

మోహనీ గ్రామానికి చెందిన రచనా గుజ్జర్ యూట్యూబ్, ఇన్‌స్టా వేదికగా వీడియోలు షేర్ చేస్తుంటుంది. బంగారం, విలాస వస్తువులు చూపిస్తూ పలు వీడియోలు పోస్టు చేసింది. అయితే కొందరు అర్థరాత్రి ఇంట్లోకి చొరబడి బంగారం ఎత్తుకెళ్లారని ఆమె తెలిపారు. తాము నిద్రిస్తున్న గదికి తాళం వేసి, మరో గదిలో ఉన్న బంగారం దోచుకెళ్లారని వాపోయారు. సీసీటీవీలో రికార్డు అవ్వకుండా వాటి యాంగిల్స్ మార్చారన్నారు. తమ గదికి తాళం వేసిన విషయాన్ని పొద్దున లేచిన తర్వాత గుర్తించామని, తెలిసినవారికి ఫోన్ చేయడంతో వారు వచ్చి తాళం తీశారని అన్నారు. ఈ చోరీకి సంబంధించిన వీడియోలను కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసారు. దొంగలు ఆమెను, ఆమె కుటుంబాన్ని ఒక గదిలో బంధించి, బంగారం, వెండి ఆభరణాలు, క్యాష్‌, చివరకు ఒక ఎనర్జీ డ్రింక్ కార్టన్‌తో సహా పారిపోయినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోయిన వస్తువుల మొత్తం విలువ సుమారు రూ. 8 నుంచి రూ. 10 లక్షల మధ్య ఉంటుందని అంచనా. దొంగతనం జరిగినట్లు శివపురి అడిషనల్ ఎస్పీ సంజీవ్ ములె ధ్రువీకరించారు. నిందితులు ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందినవారు లేక ఆ కుటుంబం గురించి తెలిసినవారు కావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు ఆ వీడియోలు చూసి, చోరీకి ప్లాన్ చేసి ఉండొచ్చని భావిస్తున్నారు.

Follow Us