అల్లూరి ఏజెన్సీలో మేకలు మందను కొండ ప్రాంతంలో మేపేందుకు తీసుకెళ్లారు కొందరు వ్యక్తులు. వర్షాలు పడుతుండటంతో.. మంచి పచ్చిక దొరుకుతుండటంతో… మేకలు, గొర్రెలు అలా అలా పైకి వెళ్లసాగాయి. పొద్దు కూకే సమయం అవ్వడంతో.. తిరిగి ఇళ్లకు వెళ్ధామనుకున్నారు. ఈ క్రమంలో మందలో ఉన్న ఓ మేక మిస్సయినట్లు వారు గుర్తించారు. మంద నుంచి తప్పిపోయి ఉంటుందని ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. కొండపై గాలించారు. ఎక్కడా కనిపించలేదు.. ఎక్కడో ఉందిలే వచ్చేస్తుందని అనుకున్నారు.. ఇంతలో ఓ గుట్ట పక్కన ఏదో శబ్దం వినిపిస్తూ ఉంది. తొంగి చూసేసరికి.. ఏదో అక్కడ కదులుతూ కనిపించింది. కాస్త దగ్గరిగా వెళ్లి పరీక్షగా చూడగా… ఓ భారీ కొండచిలువ కదలేని స్థితిలో ఉంది. దాని పొట్టలో ఏదో ఉన్నట్టు గమనించరు. ఏదో కాదు.. ఆ కొండచిలవే మేకను మింగిందని తర్వాత డిసైడ్ అయ్యారు. అరకులోయ సమీపంలోని అనంతగిరి మండలం లంగుపర్తి పంచాయతీ వెలగపాడు గ్రామ కొండపై ఈ ఘటన జరిగింది. పాతికవేలు విలువ చేసే మేకను కొండచిలువ మింగేసిందని.. దాని యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.