పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
గోదావరి పులసకు ఉన్న క్రేజ్ లాగే పులికాట్ సరస్సు రొయ్యలకు కూడా భారీ డిమాండ్ ఉంది. సముద్రం నుంచి బ్యాక్వాటర్ ద్వారా సరస్సులోకి వచ్చే ఈ రొయ్యలు సహజసిద్ధంగా పెరుగుతాయని స్థానికులు చెబుతున్నారు. తియ్యటి భూగర్భ జలాలు, సముద్రపు ఉప్పునీరు కలిసే ప్రత్యేక వాతావరణంలో పెరగడం, సహజ ఆహారం తీసుకోవడం వల్ల వీటికి ప్రత్యేక రుచి వస్తుందని చెబుతున్నారు. పట్టిన రోజే మార్కెట్కు తరలించడం వల్ల తాజాదనం కూడా వీటి ప్రత్యేకతగా మారింది.
గోదావరి పులసకు ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సముద్రం నుంచి నదిలోకి వచ్చే ఆ చేప రుచే వేరు. సరిగ్గా అదే స్థాయిలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పులికాట్ సరస్సులో దొరికే రొయ్యలకు కూడా రాష్ట్రవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ రొయ్యలను ఒక్కసారి రుచి చూస్తే ఎవరైనా సరే మళ్లీ మళ్లీ కావాలంటారు. అంతగా ఇవి నాన్వెజ్ ప్రియులను ఆకట్టుకుంటాయి. సాధారణంగా రొయ్యల సాగులో వాటి పెరుగుదల కోసం రసాయనాలు, ప్రత్యేక ఫీడ్ వాడుతుంటారు. కానీ, పులికాట్ రొయ్యల ప్రత్యేకతే వేరు. ఇవి ఎలాంటి కృత్రిమ పెంపకం లేకుండా పూర్తిగా సహజసిద్ధంగా పెరుగుతాయి. సముద్రం నుంచి బ్యాక్వాటర్ ద్వారా పులికాట్ సరస్సులోకి వచ్చే రొయ్యలు అక్కడే సంతానోత్పత్తి జరుపుకుంటాయి. సరస్సు చుట్టూ ఉన్న లంక గ్రామాలలోని తియ్యటి భూగర్భ జలాలు, సముద్రపు ఉప్పునీరు కలిసే ప్రత్యేక వాతావరణం ఇక్కడ ఉంటుంది. ఈ నీటి కలయిక వల్ల సరస్సులో ప్రత్యేక లవణీయత ఏర్పడుతుంది. ఇక్కడ సహజంగా దొరికే వానపాములు వంటి ఆహారాన్ని తింటూ ఈ రొయ్యలు పెరుగుతాయి. ఎలాంటి రసాయన మేత లేకపోవడం వల్ల వీటికి అద్భుతమైన రుచి వస్తుంది. అంతేకాకుండా, సాధారణ రొయ్యల్లా వీటిని ఐస్లో నిల్వ చేయరు. ఏరోజు పట్టిన రొయ్యలను ఆరోజే అప్పటికప్పుడే ఫ్రెష్గా మార్కెట్కు తరలించి విక్రయిస్తారు. ఈ సహజమైన రుచి, తాజాదనం కారణంగానే పులికాట్ రొయ్యలకు స్థానికంగానే కాక ఇతర జిల్లాల్లోనూ అంత డిమాండ్ మరి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
