బీచ్ ఫెస్ట్.. ఎంటర్ టైన్ మెంట్ అదిరింది!
ప్రకాశం జిల్లాలోని పాకల సముద్ర తీరం పర్యాటక ఉత్సాహంతో పరవళ్లు తొక్కుతోంది. రాష్ట్ర ప్రభుత్వం, పర్యాటక శాఖ, మారిటైమ్ బోర్డు సంయుక్తంగా నిర్వహిస్తున్న రెండు రోజుల 'పాకల బీచ్ ఫెస్టివల్' శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, కలెక్టర్ రాజాబాబు ఈ వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ ఫెస్టివల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన హెలీ రైడింగ్ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. రూ. 4 వేల ధరతో హెలికాప్టర్లో ఆకాశం నుండి సముద్ర అందాలను చూసేందుకు పర్యాటకులు పోటీ పడుతున్నారు. అంతేకాదు, పారా గ్లైడింగ్, బోట్ రైడింగ్, సముద్రపు బైక్ రైడింగ్లతో యువత కేరింతలు కొడుతోంది. బీచ్లో గుర్రపు స్వారీ, ఒంటెల సవారీలు చిన్నారులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తీరంలో నిర్వహిస్తున్న బీచ్ కబడ్డీ, వాలీబాల్ పోటీలు ఉత్సాహాన్ని నింపుతున్నాయి.సాంస్కృతిక వేదికపై ప్రముఖ యాంకర్లు సుమ, రవి తమ చమత్కారాలతో అలరించగా.. జబర్దస్త్ టీం సభ్యుల స్కిట్లు, ప్రముఖ గాయకుల పాటలు పర్యాటకులను పరవశింపజేశాయి. సాయంత్రం వేళ అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించిన సాగర హారతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భోజన ప్రియుల కోసం ఏర్పాటు చేసిన సీఫుడ్ కోర్టులు వివిధ రకాల వంటకాలతో నోరూరించాయి.రెండో రోజైన ఆదివారం మహాశివరాత్రి కావడంతో, అర్ధరాత్రి వరకు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. సుమారు 8 వేల మంది కూర్చొని వీక్షించేలా భారీ సభా ప్రాంగణాన్ని నిర్మించారు. జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిర్వహిస్తున్న ఈ బీచ్ ఫెస్ట్ పాకల తీరానికి కొత్త కళను తెచ్చింది.
మరిన్ని వీడియోల కోసం :
