నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!

Updated on: Jan 18, 2026 | 8:48 AM

అతి ఎప్పుడూ అనర్ధానికి దారితీస్తుందని పెద్దలు ఎప్పుడో చెప్పారు. విషయం ఏదైనా అతి ఎప్పుడూ పనిచేయదు. కొందరు తమను తాము నిరూపించుకోడానికి అతిగా ప్రవర్తిస్తుంటారు. అదే వారిపాలిట శాపంగా మారుతుంది. అందుకు ఉదాహరణే ఈ ఘటన. ఓ వ్యక్తి ఓ పెద్ద నాగుపామును పట్టుకున్నాడు. దానిని ఎక్కడో సురక్షితంగా వదలిపెట్టాల్సింది పోయి దాంతో ఆటలాడాడు. చివరికి అది అతన్ని కాటేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది.

ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్‌లో రోడ్డుకు ఇరువైపులా పంటపొలాలు ఉన్నాయి. అక్కడ పొలం గట్టుపైన రాజాసింగ్ అనే వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అతని చేతిలో ఓ ఆరడుగుల నాగుపాము ఉంది. అతని చేతిలో భారీ నాగుపామును చూసి స్థానికులు కంగారు పడ్డారు. పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దానిని వదిలిపెట్టాలని రాజాసింగ్‌కి చెప్పారు. అయినా అతను వినిపించుకోకుండా తన ధైర్యాన్ని వాళ్లముందు ప్రదర్శించాలనుకున్నాడు. దీంతో ఆ పామును అటూ ఇటూ తిప్పుతూ.. తలపైకి ఎత్తుకుంటూ విన్యాసాలు చేశాడు. స్థానికులు ఎంత చెప్పినా వినకుండా అతిగా ప్రవర్తించాడు. పామును భుజాలపై వేసుకొని నడుచుకుంటూ వెళ్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేసాడు. ఈ క్రమంలో ఆ పాము అతడిని కాటు వేసింది. ఏకంగా మూడు సార్లు పాము కాటువేసింది. దాంతో రాజాసింగ్‌ పరిస్థితి విషమించింది. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే విష ప్రభావంతో అప్పటికే రాజాసింగ్‌ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో కామెంట్లు చేశారు. ఇది ధైర్యం కాదు..మూర్ఖత్వం అని ఒకరు, దీనినే చావును కోరి కౌగిలించుకోవడం అంటారని మరొకరు వ్యాఖ్యానించారు.