వణికిస్తున్న వన్యప్రాణులు..కామారెడ్డిలో చిరుత .. భద్రాద్రిలో పులి !
రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో అడవి మృగాల సంచారం స్థానికులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కామారెడ్డి జిల్లాలో చిరుతపులి పశువులపై దాడి చేయగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్దపులి సంచారం భయాందోళనలు రేకెత్తిస్తోంది.కామారెడ్డి జిల్లా..లింగంపేట మండలం గాంధీనగర తండా శివార్లలో చిరుతపులి అడుగుపెట్టింది. పశువుల కొట్టంలో కట్టేసి ఉన్న రెండు లేగదూడలపై చిరుత దాడి చేసి చంపేసింది.
తెల్లవారుజామున పశువుల యజమాని వెళ్లి చూసేసరికి దూడలు విగతజీవులుగా పడి ఉన్నాయి. ఘటనా స్థలాన్ని ఫారెస్ట్ అధికారులు పరిశీలించి, అది చిరుత దాడేనని ధృవీకరించారు. చిరుతను వెంటనే బంధించేందుకు బోను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం లక్ష్మీపురం సమీపంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రేగళ్ల రేంజ్ నుంచి పులి ఆళ్లపల్లి రేంజ్ లోకి ప్రవేశించినట్లు అడుగుజాడల ద్వారా నిర్ధారించారు. పులి సంచారంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. రైతులు, కూలీలు ఎవరూ వ్యవసాయ పనుల కోసం అడవి పొలిమేరల్లోకి వెళ్లవద్దని హెచ్చరించారు. పశువుల కాపరులు పశువులను అటవీ ప్రాంతం వైపు తోలుకెళ్లవద్దని, గ్రామస్తులు రాత్రి సమయాల్లో ఒంటరిగా బయటకు రావొద్దని హెచ్చరించారు. రెండు ప్రాంతాల్లోనూ అటవీ శాఖ నిఘా పెంచింది. వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తోంది.
మరిన్ని వీడియోల కోసం :