ఏడేళ్లుగా రైల్వేపై విద్యార్థిని పోరాటం..చివరకు..

Updated on: Jan 29, 2026 | 7:21 AM

ఒక్కోసారి రైళ్లు నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా గమ్యం చేరుతుంటాయి. కారణమేదైనా రైలు ఆలస్యం కారణంగా ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఒక్కోసారి ఈ రైలు ఆలస్యం కొందరికి తీరని నష్టానికి గురిచేస్తాయి. అలాంటి ఘటనే జరిగింది ఉత్తరప్రదేశ్‌లో. రైలు ఆలస్యం కారణంగా ఓ విద్యార్థిని తన కెరీర్‌కు సంబంధించిన పరీక్ష రాయలేకపోయింది. దీంతో ఆ విద్యార్ధిని రైల్వేపై న్యాయపోరాటం చేసింది. ఏడేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత కోర్టు తీర్పు వెలువరించింది.

ఉత్తర్‌ప్రదేశ్‌ లోని బస్తీ జిల్లాకు చెందిన సమృద్ధి అనే యువతి 2018లో బీఎస్సీ బయోటెక్నాలజీ ప్రవేశ పరీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేసుకుంది. కష్టపడి చదివి ప్రవేశ పరీక్షకు సిద్ధమైంది. అయితే, పరీక్ష కేంద్రం లఖ్ నవూలో ఉండడంతో సూపర్ ఫాస్ట్ రైలుకు టికెట్ రిజర్వేషన్ చేసుకుంది. తీరా పరీక్ష రోజు ఆ రైలు ఆలస్యంగా నడవడంతో సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోలేక పోయింది. ఉదయం 11 గంటలకు లఖ్ నవూ చేరుకోవాల్సిన ఆ రైలు మధ్యాహ్నం 1:30 కు చేరింది.మధ్యాహ్నం 12:30 గంటలకు పరీక్ష మొదలవడంతో సమృద్ధి హాజరుకాలేక పోయింది. దీనిపై ఆమె జిల్లా వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించింది. రైలు ఆలస్యంగా నడవడం వల్ల పరీక్ష రాయలేకపోయానని, తన కెరీర్ లో ఏడాది కాలం వృథా అయిందని, తనకు జరిగిన నష్టానికి రూ.20 లక్షల పరిహారం ఇప్పించాలని కోరింది. ఏడేళ్ల పాటు జరిగిన సుదీర్ఘ విచారణ తర్వాత తాజాగా ఆమెకు అనుకూలంగా కమిషన్ తీర్పు వెలువరించింది. రైలు ఆలస్యం వల్ల సమృద్ధికి వాటిల్లిన నష్టానికి గానూ రూ. 9.10 లక్షల పరిహారాన్ని 45 రోజుల్లోగా చెల్లించాలని రైల్వే శాఖకు కమిషన్ ఆదేశాలు జారీచేసింది.