50 మందిని చంపి.. మొసళ్లకు ఆహారంగా వేసిన..సీరియల్‌ కిల్లర్‌ అరెస్ట్ వీడియో

Updated on: May 25, 2025 | 7:48 AM

దాదాపు 50 మందిని హత్య చేసిన సీరియల్ కిల్లర్ దేవేందర్ శర్మను ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. తిహార్ జైలు నుంచి పెరోల్ పై బయటికి వచ్చి అదృశ్యమైన ఆయుర్వేద డాక్టర్ ను ఆపరేషన్ నిర్వహించి పట్టుకున్నారు. దేవేందర్ శర్మ సీరియల్ కిల్లర్ గా ఎలా మారాడో చూసినట్లయితే 1994 లో గ్యాస్ డీలర్ షిప్ ఒప్పందం కోసం ఓ కంపెనీలో 11 లక్షల రూపాయలు పెట్టుబడిగా పెట్టాడు.

ఒప్పందం విఫలం కావడంతో భారీగా అప్పులపాలు అయ్యాడు. ఆ మరుసటి సంవత్సరం నకిలీ గ్యాస్ ఏజెన్సీ ప్రారంభించాడు. ఎల్పీజీ సిలిండర్లను తీసుకెళ్తున్న ట్రక్కులను అడ్డగించి ఆ డ్రైవర్లను చంపి సరుకును ఎత్తుకెళ్ళేవాడు. 1995, 2004 మధ్య కాలంలో ఓ ముఠాను ఏర్పాటు చేసి టాక్సీ డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని హత్యలు కొనసాగించాడు. టాక్సీలను బుక్ చేయడం, ఆ డ్రైవర్లను చంపడం, ఆ మృతదేహాలు దొరకకుండా మొసళ్లకు ఆహారంగా పడేయడం, ఆ వాహనాలను ద్వంసం చేసి మార్కెట్లో విక్రయించడం. ఇలాంటి నేరాలను కొనసాగిస్తూ వచ్చాడు. ఆ తర్వాత అక్రమ అవయవాల వ్యాపారంలోకి కూడా ప్రవేశించాడు. చివరకు 2004 లో కిడ్నీ రాకెట్ దందా ఇంకా వరుస హత్య కేసుల్లో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ, రాజస్థాన్, హర్యానాలో ఏడు కేసుల్లో అతనికి జీవిత ఖైదు పడగా గురుగ్రామ్ కోర్టు మరణ శిక్ష విధించింది.