రైళ్లో టీసీని చూడగానే ప్రయాణికుడు పరుగో పరుగు.. కారణం ఇదే
గుడివాడ రైల్వే స్టేషన్లో అర్థరాత్రి ధర్మవరం-నరసాపురం ఎక్స్ప్రెస్లో టికెట్ తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ప్రవర్తించి రైలు పైకెక్కి కలకలం సృష్టించాడు. ప్రయాణికులను భయపెట్టాడు. పోలీసులు చాకచక్యంగా అతన్ని కిందకు దించి అదుపులోకి తీసుకున్నారు, మతిస్థిమితంలేని వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనతో రైలు అరగంట ఆలస్యమైంది. రైల్వే భద్రతపై ప్రశ్నలు తలెత్తాయి.
అర్ధరాత్రి వేళ గుడివాడ రైల్వే స్టేషన్లో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ధర్మవరం-నరసాపురం ఎక్స్ప్రెస్ స్టేషన్కు చేరుకోగానే జరిగిన ఒక ఘటన ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఒక రిజర్వేషన్ బోగీలో టికెట్ తనిఖీ చేస్తుండగా, ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ప్రవర్తించాడు. టి.సి టికెట్ అడగగానే ఒక్కసారిగా కంగారుపడి, బోగీ దిగి క్షణాల్లోనే రైలు పైకప్పు ఎక్కేశాడు. ట్రైన్ పైనుంచి అతను అరుస్తూ, అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతుండటంతో ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలియక వణికిపోయారు. కొందరు ఆ ఘటనను వీడియోలు తీయగా, మరికొందరు నిశ్చేష్టులై చూస్తుండిపోయారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. పైకప్పు మీద ఉన్న వ్యక్తిని కిందికి దింపేందుకు ప్రయత్నాలు చేపట్టారు. అయితే అతను పోలీసులకు సహకరించకుండా ముప్పు తిప్పలు పెట్టాడు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అతన్ని కిందకు దించి అదుపులోకి తీసుకున్నారు. ఈ హైడ్రామా కారణంగా రైలు అరగంట పాటు స్టేషన్లోనే నిలిచిపోయింది. విచారణలో అతడిని మతి స్థిమితంలేని వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అతను అసలు రైలులోకి ఎలా ఎక్కాడు? టికెట్ లేకుండా ఎందుకు ప్రయాణిస్తున్నాడు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన రైల్వే భద్రతపై ప్రయాణికుల్లో మళ్లీ ప్రశ్నలు లేవనెత్తింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
