బైకు కొనివ్వలేదని అమ్మమ్మపై మనవడి ఘాతుకం

Updated on: Jun 26, 2026 | 6:34 PM

మెదక్ జిల్లా రామాయంపేటలో బైక్ కొనివ్వలేదని అమ్మమ్మను మనవడు హత్య చేసిన దారుణం వెలుగు చూసింది. దోమకొండ సాయమ్మ అనే వృద్ధురాలిని ఆమె మనవడు విశాల్, అతని స్నేహితుడు ప్రశాంత్‌తో కలిసి చంపేశారు. బైక్ కొనుగోలుకు డబ్బులు ఇవ్వలేదని, బంగారు నగలు దొంగిలించేందుకు మత్తు మందు కలిపి ఆమెను హత్య చేశారు. పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

మెదక్ జిల్లా రామాయంపేటలో సభ్యసమాజాన్ని కలచివేసే దారుణ ఘటన వెలుగు చూసింది. బైక్ కొనివ్వలేదని, జల్సాలకు డబ్బులు అడిగినందుకు తనను ప్రేమగా పెంచి పెద్ద చేసిన సొంత అమ్మమ్మనే ఓ మనవడు దారుణంగా హత్య చేశాడు. రామాయంపేట మున్సిపాలిటీ 10వ వార్డుకు చెందిన దోమకొండ సాయమ్మ అనే వృద్ధురాలు జూన్ 18న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తొలుత గుండెపోటుగా భావించినప్పటికీ, మెడపై గాట్లు, శరీరంలోని, బీరువాలోని బంగారు నగలు, డబ్బు మాయం కావడంతో బంధువులకు అనుమానం కలిగింది.ఈ క్రమంలో సాయమ్మ చిన్న కూతురు కుమారుడైన విశాల్‌పై బంధువులు దృష్టి సారించారు. స్థానికుల సమాచారం మేరకు జూన్ 17 రాత్రి విశాల్ అమ్మమ్మ వద్దకు వచ్చినట్లు తేలింది. కొత్త బైక్ కొనుగోలుకు డబ్బులు కావాలని విశాల్ అమ్మమ్మపై ఒత్తిడి చేశాడు. ఆమె వద్ద రూ.7,000 మాత్రమే ఉన్నాయని చెప్పడంతో, ఆమె మెడలోని నగలను కాజేయాలని పథకం వేశాడు. తన స్నేహితుడు ప్రశాంత్‌తో కలిసి అమ్మమ్మ తాగే కల్లులో మత్తు మాత్రలు కలిపాడు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళాక నగలు, డబ్బు దొంగిలించే ప్రయత్నం చేయగా, ఆమె కలవరించడంతో భయపడి విశాల్ ఆమె గొంతు నులమగా, ప్రశాంత్ కాళ్ళు పట్టుకొని హత్య చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు విశాల్, ప్రశాంత్‌లను అరెస్టు చేసి, దొంగలించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. సీఐ సైదా నాయక్ ఈ వివరాలను వెల్లడించారు.

మరిన్ని వీడియోల కోసం :

Follow Us