Vijayawada: సింగ్ నగర్‌ వరద కన్నీటికి సాక్ష్యం ఈ దృశ్యాలే.. పాల ప్యాకెట్ల కోసం..

|

Sep 03, 2024 | 11:51 AM

విజయవాడలోని సింగ్‌నగర్‌లో ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఆహారం లేక జనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు కాలనీలకు ఇంకా తాగునీరు చేరలేదు. ప్రస్తుతం ముంపు ప్రాంతాల్లో 5 హెలికాప్టర్లు, డ్రోన్‌లతో ఆహారం సరఫరా చేస్తున్నారు. పెద్దయెత్తున ప్రభుత్వం పాలు, వాటర్‌, ఆహారపొట్లాలు అందించే ప్రయత్నం చేస్తున్నారు. లక్షలాది మంది బాధితులు ఉండటంతో ఈ ఉదయం నుంచి ఆహార పంపిణీ స్పీడప్‌ చేశారు.

కంటి మీద కునుకులేదు.. కడుపు నిండా తిండిలేదు..  ఇప్పటికే 2 రోజులుగా ప్రత్యక్ష నరకం..వరద చూస్తే ఇంకో 2 రోజులు తగ్గేలా లేదు..
ఇంత దయనీమైన పరిస్థితులు బెజవాడవాసులు జీవితంలో చూసుండరేమో..! ఎటు చూసినా ఆకలి కేకలు.. సాయం కోసం ఆర్తనాదాలు..!  ప్రభుత్వం వందల మంది అధికారుల్ని, వేల మంది సిబ్బందిని సహాయ చర్యలకు రంగంలోకి దించినా చివరి వరకూ సాయం అందని పరిస్థితి. స్వయంగా CM చంద్రబాబు సహాయ చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. చివరి వరద బాధితుల వరకూ సాయం అందేలా చూడాలని ఒకటికి రెండు సార్లు చెప్తున్నారు. మంత్రుల్ని, ఉన్నతాధికారుల్ని కూడా రంగంలోకి దించి సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. ఎంత చేస్తున్నా బాధితులు పెద్ద సంఖ్యలో ఉండడంతో సాయంలో మరింత స్పీడ్ పెంచాల్సిన పరిస్థితి.  ఫుడ్ ట్రక్‌లు రావడం ఆలస్యం కాలనీ మొదట్లోనే ఖాళీ అయిపోతున్నాయి.  బోట్లతో లోపలికి పంపుతున్నా అవి కూడా చివరి వరకూ చేరడం లేదు.  ఆఖరు వారికి కూడా సాయం చేసేందుకు చివరికి హెలికాఫ్టర్లను, డోన్లను వాడుతున్నారు. పేషెంట్లకు మందుల సరఫరా చేయాలన్నా, పిల్లలకు కనీసం పాలు, బిస్కెట్లు ఇవ్వాలన్నా కూడా అడుగడుగునా ఇబ్బందులే..!

ఫుడ్‌ట్రక్‌ల దగ్గరైతే పరిస్థితులు హృదయవిదారకంగా ఉన్నాయి.. ఓ పాలప్యాకెట్ దొరికితే బావుండు.. పిల్లల కడుపు నిండుతుందని ఓ తండ్రి చేతులు చాస్తుంటే.. ఓ బిస్కెట్ ప్యాకెట్ దొరికినా ఈ పూట గడిచిపోతుందనే ఆవేదనతో ఓ పెద్దాయన ఎదురు చూస్తున్నారు..  పాలు, బిస్కెట్లు మాట సరే.. కనీసం మంచినీళ్లు దొరికినా చాలనే ఆశ ఇంకొందరిది..  మహిళల కూడా సాయం కోసం రోడ్లపైకి వచ్చి ఎదురు చూస్తున్నారు..  సింగ్‌ నగర్ ఫ్లైఓవర్‌పైన వేల మంది బాధితులు సాయం కోసం పడిగాపులు పడుతున్నారు. ఏదైనా ఫుడ్‌ట్రక్‌ రావడం ఆలస్యం.. అంతా ఎగబడి తీసేసుకుంటున్నారు. దిగువ ప్రాంతాలకు పంపాలన్నా వీలు కానంతగా ఇక్కడే వాహనాలు ఖాళీ అయ్యే పరిస్థితి.

వరద బాధిత జనం కష్టాలు చూస్తే కన్నీళ్లొస్తున్నాయ్‌..!  ముఖ్యంగా సింగ్‌ నగర్‌ అయితే విషాదానికి కేరాఫ్‌లా ఉంది. నిన్నటి నుంచి వర్షం తగ్గినా వరద ముప్పు మాత్రం ఇంకా ఉంది.. బుడమేరుకి వరద ఉధృతి తగ్గడం, ప్రకాశం బ్యారేజ్ దగ్గర కూడా నీటిమట్టం తగ్గడంతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్నా.. చాలా కాలనీల్లో ఇళ్లల్లోకి అడుగుపెట్టే పరిస్థితి లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.  సాయం కోసం లక్షల మంది దీనంగా ఎదురు చూస్తున్నారు.  ప్రభుత్వం చేస్తున్న సహాయ చర్యలు ఇంకా వేగంగా జరగాలని వారు కోరుకుంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..   

Follow us on