చెరువులో నోట్ల కట్టలు.. పరిగెత్తుకెళ్లిన పోలీసులకు షాక్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట లచ్చపురం చెరువులో ₹500 నోట్ల కట్టలు కనిపించి కలకలం సృష్టించాయి. నకిలీ నోట్ల ముఠా భయంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీరా పరిశీలించగా అవి పిల్లలు ఆడుకునే బొమ్మ నోట్లని తేలింది. పోలీసులకు, స్థానికులకు ఊపిరి పీల్చుకున్నారు. ఆకతాయిల చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో జరిగిన ఒక ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేస్తే, పోలీసులను మాత్రం అయోమయానికి గురిచేసింది. లచ్చపురం గ్రామ చెరువులో రూ.500 నోట్ల కట్టలు, మరికొన్ని చింపివేసిన నోట్లు పడి ఉండటాన్ని చూసిన గ్రామస్తులు ఒక్కసారిగా కంగుతిన్నారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ఇటీవల అశ్వారావుపేటలో దొంగనోట్ల సరఫరా చేసే ముఠాను పోలీసులు అరెస్ట్ చేయగా, లచ్చపురం గ్రామానికి చెందిన వ్యక్తుల ప్రమేయం ఉండటంతో అందరూ ఉలిక్కిపడ్డారు. ఇప్పుడు చెరువులో నోట్లు దొరకడంతో, తమ గ్రామంలో కూడా దొంగనోట్ల ముఠా ఉందేమోనని, తమ గ్రామం పరువు పోతుందని గ్రామస్తులు భయపడి పోలీసులకు సమాచారం అందించారు. పెద్ద కేసే దొరికిందని సంబరపడిన పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. చెరువులో ఉన్న కట్టలను బయటకు తీసి పరీక్షించగా, అసలు విషయం బయటపడింది. అవి నిజమైన కరెన్సీ నోట్లు కాదని, పిల్లలు ఆడుకునే ‘చాక్లెట్’ బొమ్మ నోట్లని తేలడంతో పోలీసులు కూడా ఒక్క క్షణం షాక్కు గురయ్యారు. దొంగనోట్ల కట్టలు అనుకుంటే, చివరకు అవి పిల్లలు ఆడుకునే నోట్లు కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇది ఆకతాయిల పనేనని, పోలీసులను, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరించిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
