బురదలో తేలుతున్న వెండి.. జనం వేట చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Updated on: Feb 14, 2026 | 9:29 AM

అది ఒక సాధారణ బోరుబావి తవ్వకం.. కానీ అక్కడ బయటపడిన మెరిసే రాళ్లు స్థానికుల్లో ఒక్కసారిగా ఆశలు రేకెత్తించాయి. రాజస్థాన్‌లోని అల్వార్ నగరం అల్కాపురి కాలనీలో వెండి లాంటి లోహం దొరుకుతోందన్న వార్త దావాపలంలా వ్యాపించడంతో, ప్రజలు ఎగబడ్డారు. అల్వార్‌ నగరంలో నీటి ఎద్దడిని నివారించేందుకు నీటి సరఫరా శాఖ అల్కాపురి కాలనీలో బోరు తవ్వకం చేపట్టింది. ఈ క్రమంలో భూమిలో నుంచి వస్తున్న బురద మట్టిలో వెండిలా మెరిసే కొన్ని రాళ్లు కనిపించాయి.

అది విలువైన వెండి అని భావించిన కార్మికులు, స్థానికులు ఒక్కసారిగా ఆ బురదలో వెతుకులాట ప్రారంభించారు. చూస్తుండగానే వందలాది మంది అక్కడికి చేరుకోవడంతో ఆ ప్రాంతం జనసంద్రంగా మారింది.అదృష్టం వరిస్తుందేమోనన్న ఆశతో జనం తొక్కిసలాటను సైతం లెక్కచేయకుండా బురదలో దిగారు. కొందరైతే బట్టలు విప్పి మరీ ఆ మెరిసే రాళ్ల కోసం గంటల తరబడి గాలించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, ఆ మెరిసే వస్తువు నిజంగా వెండేనా.. లేక మరేదైనా ఖనిజమా అన్నది తెలియరాలేదు. పెద్ద ఎత్తున జనం గుమిగూడటంతో ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోయాయి. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు పరిస్థితిని అదుపు చేసేందుకు విశ్వప్రయత్నం చేశారు. అలుపెరగని ఈ ‘వెండి’ వేట చివరకు ఎటు దారితీస్తుందో చూడాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us