కన్నీరు పెట్టిస్తున్న టమోటా.. కుదేలవుతున్న రైతులు

Updated on: Feb 24, 2026 | 1:54 PM

ఆసియాలోనే అతిపెద్ద మదనపల్లె టమోటా మార్కెట్‌లో ధరలు దారుణంగా పడిపోయాయి. కిలో రూ. 3-7కు చేరడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి దిగుబడి ఎక్కువ ఉండటం, స్థానిక కొనుగోలుదారులు లేకపోవడంతో రైతులు రవాణా ఖర్చులు కూడా పొందలేకపోతున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని గిట్టుబాటు ధర కల్పించి, నేరుగా కొనుగోలు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. మార్చి నుంచి ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా.

నిన్నటి వరకు ఆకాశాన్ని తాకిన టమోటా ధరలు ఇప్పుడు నేలచూపులు చూస్తున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద టమోటా మార్కెట్‌గా పేరుగాంచిన మదనపల్లిలో ధరలు దారుణంగా పడిపోవడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతాంగం తీవ్ర ఆందోళనలో ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో టమోటా ధర కేవలం రూ. 3 నుండి రూ. 7 మధ్య పలుకుతుండటం రైతులను కంటతడి పెట్టిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాల్లో దిగుబడి ఆశాజనకంగా ఉండటంతో ఇతర ప్రాంతాల ట్రేడర్లు మదనపల్లి వైపు రావడం లేదు. ప్రస్తుతం అన్‌సీజన్ కావడంతో పాటు స్థానికంగా కొనుగోలుదారులు కరువయ్యారు. రాయలసీమ నలుమూలల నుంచి ఆశతో వస్తున్న రైతులకు కనీసం రవాణా ఖర్చులు కూడా రాని పరిస్థితి నెలకొంది. సాగు కోసం చేసిన అప్పులు తీరక, అయినకాడికి అమ్ముకోలేక రైతులు లబోదిబోమంటున్నారు. ధరలు పెరిగినప్పుడు మార్కెట్లలో హడావుడి చేసే అధికారులు, ధర పడిపోయి రైతు నష్టపోతున్నప్పుడు ఎందుకు స్పందించడం లేదని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. గిట్టుబాటు ధర లేని సమయంలో ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మదనపల్లి, పుంగనూరు, పలమనేరు పరిసరాల్లో 1500 హెక్టార్లలో టమాటా పంట సాగులో ఉంది. ప్రస్తుతం దిగుబడి తక్కువగా ఉన్నా, మార్చి నెల నుంచి ధరలు పుంజుకునే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘ఏఐ’ రాకతో.. వారిని తొలగించా !! మానసిక క్షోభతో యజమాని కన్నీరు !!

మెక్సికోలో డ్రగ్స్‌ డాన్‌ హతం చెలరేగిన హింస.. భారతీయులూ జాగ్రత్త

పాక్‌ ఉగ్రవాదులను పట్టించిన ‘టైసన్’

Follow Us