నో వెయిటింగ్‌.. నో పుషింగ్‌.. శ్రీవారి సన్నిధిలో కొత్త టెక్నాలజీ సూపర్‌ సక్సెస్‌

Updated on: Jan 02, 2026 | 4:20 PM

వైకుంఠ ఏకాదశి, జనవరి 1న తిరుమల భక్తులకు టీటీడీ ఆధునిక సాంకేతికత, AI, స్లాట్ విధానం ద్వారా సులభ దర్శనం కల్పించింది. రికార్డు స్థాయిలో భక్తులు వచ్చినా, గంటల నిరీక్షణ లేకుండా, తోపులాటలు లేకుండా దర్శన భాగ్యం కలిగింది. ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ పర్యవేక్షణతో క్యూలైన్లు విజయవంతంగా నిర్వహించబడ్డాయి.

ఏకాదశి, ద్వాదశి, జనవరి ఒకటి సందర్భంగా తిరుమలకు భక్తులు పోటెత్తారు. అయితే గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షణకు అధికారులు తెర దించారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి పక్కా ప్రణాళికతో టీటీడీ చేసిన ఏర్పాట్లు సక్సెస్‌ అయ్యాయి. రికార్డు స్థాయిలో భక్తులు తరలివచ్చినా ఎక్కడా తోపులాటలు, గంటల తరబడి వేచిచూసే ఇబ్బందులు లేకుండా దర్శనం లభించింది. ఏఐ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ సిబ్బందికి దిశానిర్దేశం చేయడం వల్లే ఇది సాధ్యమైందని టీటీడీ అధికారులు వెల్లడించారు. సుమారు 70 వేలమంది భక్తులు దర్శనానికి వస్తారని అంచనా వేసిన టీటీడీ అందుకు తగ్గట్టుగా స్లాట్‌ విధానాన్ని అమలు చేసింది. ఎక్కడ రిపోర్ట్‌ చేయాలి? ఏ సమయానికి రావాలి? అనే సమాచారాన్ని భక్తులకు ముందే మెసేజ్‌లు పంపించింది. దీంతో వైకుంఠ ఏకాదశి రోజు రికార్డు స్థాయిలో 67,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. మరుసటి రోజు అదే స్థాయిలో భక్తులకు దర్శన భాగ్యం కలిగింది. ఇంత పెద్దసంఖ్యలో భక్తులు వచ్చినా స్లాట్‌ విధానం అద్భుతంగా పనిచేసింది. 98 శాతం మంది భక్తులు కేటాయించిన స్లాట్‌ సమయానికే రిపోర్ట్‌ చేశారు. నాలుగు గంటలకు మించి క్యూలైన్లో వేచి ఉండాల్సిన అవసరం రాలేదు. చాలామందికి గంటన్నర నుంచి రెండు గంటల్లోనే దర్శనం పూర్తయింది. ఒకేచోట రద్దీ ఏర్పడకుండా మూడు వేర్వేరు ప్రాంతాల్లో రిపోర్టింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేయడంతో క్యూలైన్ల నిర్వహణ సులభమైంది. టికెట్‌ జారీ దగ్గరి నుంచి లగేజ్‌ డిపాజిట్, బాడీ స్కానింగ్, దర్శనం పూర్తయ్యే వరకూ ప్రతిదశనూ రియల్‌ టైమ్‌లో డాష్‌బోర్డు ద్వారా పర్యవేక్షించారు. దాదాపు 300కు పైగా సీసీ కెమెరాలు, కొత్తగా ఏర్పాటు చేసుకున్న 42 ఫేస్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌ కెమెరాల ద్వారా రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేశారు. క్యూలైన్లలో ఎక్కడైనా రద్దీ పెరిగితే వెంటనే ఆన్‌లైన్‌ ద్వారా గుర్తించి సిబ్బందిని అప్రమత్తం చేశారు. పోలీసులు, జిల్లా యంత్రాంగం, మీడియా సహకారం తోడు భక్తులు తితిదే సూచనలు పాటించడం వల్లే వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు విజయవంతమయ్యాయని టీటీడీ భావిస్తోంది. భవిష్యత్తులోనూ క్యూలైన్ల నిర్వహణలో ఏఐ టెక్నాలజీని మరింత విస్తృతంగా వినియోగించనుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఓరి మీ ఏషాలో.. న్యూ ఇయర్‌ వేళ మందుబాబుల హంగామా

కొత్త ఏడాది వేళ.. స్విట్జర్లాండ్‌ బార్‌లో బాంబ్ బ్లాస్ట్ !!

విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి తేదీ ఫిక్స్..?

Teja Sajja: నేను విన్నాను.. నేనున్నాను అంటున్న హీరో

Nayanthara: నయనతారకు మాత్రమే అదెలా సాధ్యం..?