Telangana: తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ..

Updated on: Mar 17, 2026 | 10:18 AM

తెలంగాణ శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. మరోవైపు బీజేపీ నేతలు బషీర్ బాగ్ నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీ చేపట్టారు. రైతుల లక్ష దరఖాస్తులతో చేపట్టిన ర్యాలీ అసెంబ్లీ గేటు వద్ద తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

తెలంగాణ శాసనసభా సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ సభలో ప్రశ్నోత్తరాలను స్పీకర్ రద్దు చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ చేపట్టారు. అయితే రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై వెంటనే చర్చించాలని కోరుతూ బీఆర్ఎస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీనిని స్పీకర్ తిరస్కరించడంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. మరోవైపు అసెంబ్లీ బయట బీజేపీ ప్రజాప్రతినిధులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. బషీర్‌బాగ్ నుంచి అసెంబ్లీ వరకు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భారీ ర్యాలీ నిర్వహించారు. రైతుల నుంచి సేకరించిన సుమారు లక్ష దరఖాస్తులను తోపుడు బండిపై ఉంచి అమరవీరుల స్థూపం వరకు తీసుకొచ్చారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ గన్ పార్క్ వద్ద నిరసన తెలిపిన బీజేపీ నేతలు, ఆ దరఖాస్తులతో సభలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.

గేటు వద్ద ఉద్రిక్తత

అసెంబ్లీ గేటు వద్ద పోలీసులు బీజేపీ నేతలను అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల తీరుపై ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసేపు ఉద్రిక్తత కొనసాగిన తర్వాత చివరకు పోలీసులు దరఖాస్తులతో సహా బీజేపీ నేతలను లోపలికి అనుమతించారు.

Follow Us