2027లో AI తుఫాను? మూడేళ్లే టైమ్.. మేలుకోకపోతే మనుగడ కష్టమే
కృత్రిమ మేధ ప్రభావం రాబోయే మూడేళ్లలో ప్రపంచాన్ని పూర్తిగా మార్చేస్తుందని గూగుల్ ఎక్స్ మాజీ అధికారి మో గావ్డాట్ హెచ్చరించారు. 2027 నాటికి AGI వ్యవస్థలు అందుబాటులోకి రావచ్చని, దీంతో అనేక ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సృజనాత్మకత, శారీరక నైపుణ్యాలపై యువత ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని సూచించారు.
రోజురోజుకూ కృత్రిమ మేధ అన్ని రంగాల్లోకి, ప్రజల జీవితంలోకి వేగంగా విస్తరిస్తోంది. చాట్జీపీటీ, క్లాడ్, జెమిని ఏఐ వంటి కృత్రిమ మేధ టూల్స్ ఇప్పటికే మన జీవితాల్లో భాగమయ్యాయి. అయితే, ప్రస్తుతం మనం చూస్తున్న చాట్జీపీటీ, క్లాడ్, జెమిని వంటి ఏఐ టూల్స్ కేవలం ఆరంభమేనని, అసలైన తుఫాను ముందుంది అని గూగుల్ ఎక్స్ మాజీ ఎగ్జిక్యూటివ్ మో గావ్డాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే కొన్నేళ్లలో ‘ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్’ వ్యవస్థలు రాబోతున్నాయని, దీనివల్ల ఊహించని స్థాయిలో ఉద్యోగాల నష్టాలు, ఆర్థిక అస్థిరత, భారీ సామాజిక మార్పులు వస్తాయని ఆయన హెచ్చరించారు. కానీ, దురదృష్టవశాత్తూ చాలా మంది ఈ ముప్పును ఎదుర్కోవడానికి ఇంకా సిద్ధంగా లేరని గావ్డాట్ అభిప్రాయపడ్డారు. AI వల్ల రాబోతున్న మహా విప్లవానికి తగినట్లుగా మానవాళి రెడీ కావడానికి ఇంకా మూడేళ్లు మాత్రమే టైం ఉందని ఆయన స్పష్టం చేశారు. చాలామంది కంటెంట్ రాయడానికి, అనువాదాలకే ఏఐ ఉపయోగపడుతోందని భావిస్తున్నారాని, నిజానికి చాలా ల్యాబ్స్లో ఊహకు అందనంత భయంకర ప్రయోగాలు జరుగుతున్నాయన్నారు. ‘ది డైరీ ఆఫ్ ఎ సీఈఓ’ అనే పాడ్కాస్ట్లో ఆయన మాట్లాడుతూ.. ” AGI 2027 నాటికి వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను’ అని కుండబద్దలు కొట్టారు. AI సిస్టమ్స్ తమ కోడ్ను తామే అసాధారణ వేగంతో మెరుగుపరుచుకుంటూ మానవుడి మేథకు అందనంతగా పరివర్తన చెందుతున్నాయన్నారు. అయితే.. నిజమైన ప్రమాదం AI వల్ల కాదని, దానిని మన ప్రభుత్వాలు, కార్పొరేట్ కంపెనీలు ఎలా వాడుకుంటాయనే దానిపై ఫలితాలు ఆధారపడి ఉంటాయన్నారు. AI మూలంగా కంప్యూటర్ ముందు కూర్చుని పని చేసే ఎంట్రీ-లెవల్ నాలెడ్జ్ వర్కర్లపై పడుతుందని గావ్డాట్ హెచ్చరించారు. కాల్ సెంటర్ ఏజెంట్లు, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్లు, ట్రావెల్ ఏజెంట్లు వంటి పనులు త్వరలోనే పూర్తిగా కనుమరుగవుతాయి. అలాగే పారా లీగల్స్, ఫైనాన్షియల్ ఎనలిస్టులు, గ్రాఫిక్ డిజైనర్లు, కంపోజర్లు, మిడిల్ మేనేజర్లు, రోగ నిర్ధారణ చేసే డాక్టర్ల పని భారం కూడా గణనీయంగా తగ్గిపోతుందన్నారు. గతంలో వంద మంది చేసే పనిని ఒక్కడే AI సాయంతో చేస్తుండటంతో కంపెనీలు హైరింగ్ ఆపేస్తున్నాయన్నారు. కనుక కోవిడ్ టైంలో అలర్ట్ గా ఉన్నట్లు.. ఇప్పటి నుంచే నిరుద్యోగ గండం నుంచి తప్పించుకోవడానికి ప్రభుత్వాలు,యువత రెడీ కావాలని సూచించారు. రాబోయే రోజుల్లో AI ప్రభావం వల్ల సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల వంటివి పెరిగి.. డ్రైవర్లు, లాజిస్టిక్స్ వంటి ఉద్యోగాలు పోతాయన్నారు. అందుకే శారీరక శ్రమతో కూడిన చెక్కపని వంటి వృత్తులు నేర్చుకోవడం మంచిదని మో.. సలహా ఇచ్చారు. ఇక..యంత్రాలు ఎప్పటికీ కాపీ చేయలేని కమ్యూనికేషన్ స్కిల్స్,క్రియేటివిటీ ఉండే జాబ్స్ కూడా ఎంచుకోవాలని ఆయన యువతకు సూచించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వీధికుక్క కోసం కొట్టుకుంటున్న రెండు దేశాలు
24 అంతస్తులు.. 2,200 పడకలు.. దేశంలోనే టాప్ సర్కారు హాస్పిటల్ రెడీ
ఆటోలో 15 మందా? పాతబస్తీలో డేంజర్ జర్నీ!
