గోళీలే ఆయుధాలు.. షాపింగ్ మాల్సే వారి టార్గెట్
హైదరాబాద్లో దుకాణాల అద్దాలను స్లింగ్షాట్తో పగులగొడుతూ వ్యాపారులను భయభ్రాంతులకు గురిచేసిన నలుగురు యువకులను ఐఎస్ సదన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఖలీద్ బిన్ అలీ, మూసా బావాజీర్, హిలాల్ మొహియుద్దీన్, ముద్దాసిర్ ఖురేషి అనే పాతబస్తీకి చెందిన ఈ ముఠా క్వాలిస్ వాహనంలో తిరుగుతూ ఈ వికృత చేష్టలకు పాల్పడింది. 11 కేసుల్లో లక్షలాది రూపాయల నష్టం కలిగించిన నిందితుల అరెస్ట్తో వ్యాపారులకు ఊరట లభించింది.
హైదరాబాద్లో రహదారులపై వెళ్తూ కంటికి కనిపించిన దుకాణాల అద్దాలను ధ్వంసం చేస్తూ, వ్యాపారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న నలుగురు పోకిరీలను ఐఎస్ సదన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఒక క్వాలిస్ వాహనం, రెండు సెల్ఫోన్లు, ఒక గిల్లెర్ స్లింగ్ షాట్ , గోళీలను స్వాధీనం చేసుకున్నారు. పాతబస్తీకి చెందిన ఖలీద్ బిన్ అలీ, మూసా బావాజీర్, హిలాల్ మొహియుద్దీన్, ముద్దాసిర్ ఖురేషి అనే నలుగురు యువకులు ఒక ముఠాగా ఏర్పడ్డారు. వీరు క్వాలిస్ వాహనంలో సైదాబాద్, సంతోష్ నగర్, ఐఎస్ సదన్, మలక్పేట, చాంద్రాయణగుట్ట వంటి ప్రాంతాల్లో తిరుగుతూ వికృత చేష్టలకు పాల్పడేవారు. నడుస్తున్న వాహనం నుంచే గిల్లెర్ (Slingshot) సాయంతో స్టీల్ గోళీలను షాపింగ్ మాల్స్, దుకాణాల పెద్ద పెద్ద అద్దాలపైకి వేగంగా విసిరేవారు. ఆ గోళీలు తగిలి అద్దాలు ముక్కలవుతుంటే చూసి పైశాచిక ఆనందం పొందడం వీరి అలవాటు. ఇలా ఇప్పటివరకు మొత్తం 11 కేసుల్లో వీరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వరుస ఘటనలతో ఆందోళన చెందిన వ్యాపారుల ఫిర్యాదు మేరకు నిఘా పెట్టిన ఐఎస్ సదన్ పోలీసులు, సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరి అకృత్యాల వల్ల లక్షలాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు వాపోతున్నారు. పట్టుబడ్డ నలుగురు నిందితులను పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ అరెస్ట్తో అద్దాల దుకాణాల యజమానులు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కార్పొరేట్ కోటలు బద్దలు.. ప్రభుత్వ స్కూల్ విద్యార్థుల ‘విజయ’ కేతనం
