YS Jagan: అంబటి నివాసానికి వైఎస్ జగన్.. గుంటూరులో పోలీసుల హైఅలర్ట్..
వైఎస్ జగన్ గుంటూరులో పర్యటిస్తున్నారు. మాజీ మంత్రి అంబటి కుటుంబాన్ని పరామర్శించి, ధ్వంసమైన ఆఫీసును పరిశీలించనున్నారు. జగన్ టూర్ నేపథ్యంలో గుంటూరు నగరం మొత్తం హై సెక్యూరిటీ వలయంలోకి వెళ్లిపోయింది. ఇటీవల జరిగిన ఘర్షణల నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరులో పర్యటిస్తున్నారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి నేరుగా మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వెళ్తున్నారు. ఇటీవల గుంటూరులో అంబటి రాంబాబు కార్యాలయం, నివాసంపై జరిగిన దాడి ఘటనను జగన్ తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో ధ్వంసమైన అంబటి ఆఫీస్ను, ఇంటిని స్వయంగా పరిశీలిస్తారు. జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించి.. వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. జగన్కు ఉన్న జెడ్-ప్లస్ కేటగిరీ భద్రత దృష్ట్యా, పర్యటన పొడవునా భారీగా బలగాలను మోహరించారు. మొత్తం 9 వాహనాల కాన్వాయ్తో ఆయన గుంటూరు చేరుకోనున్నారు.
పోలీసుల హై అలర్ట్
జగన్ ప్రయాణించే మార్గాల్లో రోప్ పార్టీ సభ్యులను మోహరించి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా ఉంచారు. జగన్ రాకతో గుంటూరు నగరంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. జగన్ ప్రయాణించే ప్రధాన మార్గాల్లో సాధారణ వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నారు. ప్రధాన కూడళ్ల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసి హై సెక్యూరిటీ జోన్లుగా ప్రకటించారు. దీనివల్ల ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లిస్తున్నారు.
