Elkathurthy: ఎల్కతుర్తిలో BRS రజతోత్సవ సభ.. పోటెత్తిన గులాబీ దండు

Updated on: Apr 27, 2025 | 4:34 PM

తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా పుట్టిన పార్టీ. రాష్ట్ర సాధనకోసం అలుపెరగకుండా పోరాడిన పార్టీ. మరి, రాష్ట్ర ఏర్పాటు జరిగిపోయాక.. దాని అవసరం ఏంటి? తెలంగాణ ఆవిర్భావం తర్వాత చాలామంది ఇదే మాట అన్నారు. బయటివారే కాదు, కేసీఆర్‌ కూడా అదే తలిచారు. కానీ, కాలం మరోటి తలిచింది. అందుకేనేమో, తెలంగాణకు ముందు, ఆ తర్వాత.. అన్నట్టు.. కొత్త చరిత్ర సృష్టించింది టీఆర్‌ఎస్‌. కాలాంతరంలో బీఆర్‌ఎస్‌గానూ మారింది.

బీఆర్ఎస్ సిల్వర్‌జూబ్లీకి హనుమకొండ జిల్లాఎల్కతుర్తిలో జరుగుతుంది. సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గులాబీ పార్టీ.. తన బలం, బలగాన్ని అధికార పార్టీకి మాత్రమే కాకుండా దేశమంతా చూపింస్తుంది. ఇందుకోసం 1,213 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. 5 ఎకరాల్లో ప్రధాన వేదికను పెట్టారు. సుమారు 500 మంది ముఖ్య నేతలు కూర్చునేలా భారీ వేదికను తయారు చేశారు. అలాగే, వాహనాల పార్కింగ్ కోసం 1,059 ఎకరాల్లో విశాలమైన స్థలాన్ని బీఆర్ఎస్ పార్టీ కేటాయించింది.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటే లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న పార్టీని స్థాపించిన కేసీఆర్… రాష్ట్ర సాధన తర్వాత రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ప్రతిపక్ష హోదాలో ఉన్న గులాబీ పార్టీ ఆవిర్భవించి నేటికి 25 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. దీంతో గులాబీ పార్టీ సిల్వర్‌ జూబ్లీకి గ్రాండ్‌గా ఏర్పాట్లు చేసింది.

సభ ఏర్పాట్లన్నీ ఓ ఎత్తైతే… గులాబీ దళపతి స్పీచ్‌ మరో ఎత్తనే చెప్పాలి. సుదీర్ఘ విరామం తర్వాత బహిరంగ సభలో KCR ఏం మాట్లాడతారని రాష్ట్రమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ప్రభుత్వ పాలన, పథకాల అమలు, కాంగ్రెస్ నేతల విమర్శలు ఇలా అన్నింటిపై KCR ప్రసంగించే అవకాశం ఉంది. రాబోయే ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేసేలా, భవిష్యత్తులో పార్టీ అనుసరించాల్సిన ప్రణాళికలను కూడా ఇదే వేదిక నుంచి కేసీఆర్ వివరించే అవకాశం ఉంది.