జస్ట్ 80 డేస్… క్రేజీ న్యూస్ రివీల్ చేసిన జక్కన్న
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న వారణాసి చిత్రంపై జక్కన్న తాజాగా కీలక వివరాలను వెల్లడించారు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తైందని, సెప్టెంబర్-అక్టోబర్ నాటికి చిత్రీకరణ పూర్తవుతుందని తెలిపారు. ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ అద్భుతమైన విజువల్స్తో పాటు తండ్రీకొడుకుల సెంటిమెంట్ను అందిస్తుందని రాజమౌళి పేర్కొన్నారు.
మహేష్ బాబు హీరోగా ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక గ్లోబల్ ప్రాజెక్ట్ వారణాసి (SSMB29)పై జక్కన్న తాజాగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్యారిస్లో జరిగిన ఆర్ఆర్ఆర్, బాహుబలి, ఈగ చిత్రాల ప్రత్యేక స్క్రీనింగ్స్లో పాల్గొన్న రాజమౌళి, ఈ సందర్భంగా వారణాసి ప్రమోషన్స్ను కూడా కానిచ్చేశారు.ఈ చిత్రం ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని రాజమౌళి తెలిపారు. మిగిలిన 20 శాతం చిత్రీకరణ సెప్టెంబర్-అక్టోబర్ నాటికి పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయని, దీంతో ఏప్రిల్ 7, 2027న ప్రకటించిన తేదీకి సినిమా విడుదల కావడం ఖాయమని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది.వారణాసి కథా నేపథ్యం గురించి మాట్లాడుతూ, ఆఫ్రికాలోని దట్టమైన అడవులు, అంటార్కిటికాలోని మంచు ఖండాలు, రామాయణ కాలం నాటి దివ్య ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్తామని రాజమౌళి వివరించారు. భారీ ప్రకృతి విపత్తులు, మైండ్ బ్లోయింగ్ ఫాంటసీ అంశాలు సినిమాలో ఉంటాయని తెలిపారు.
