ఉదయాన్నే టీ తాగుతున్నారా? ఇది తెలిస్తే ఇక టీ జోలికి వెళ్లరు
భోజనం చేసిన వెంటనే లేదా అల్పాహారంతో పాటు టీ తాగడం వల్ల ఆహారంలోని ఐరన్ శరీరానికి సరిగా అందక రక్తహీనత ప్రమాదం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీలోని టానిన్లు, పాలిఫెనాల్స్ ఐరన్ శోషణను తగ్గిస్తాయి. భోజనం తర్వాత కనీసం 1–2 గంటల విరామంతో టీ తాగడం, విటమిన్-సి ఉన్న ఆహారం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
ఉదయం లేవగానే వేడివేడి టీ తాగడం చాలామందికి అలవాటు. అయితే, ఈ చిన్న అలవాటే మన ఆరోగ్యానికి ఎంత పెద్ద హాని చేస్తుందో మీకు తెలుసా? ఉదయం మాత్రమే కాదు.. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత.. లేదంటే ఉదయం టిఫిన్ చేసిన వెంటనే చాలామంది టీ లేదా కాఫీ తాగుతుంటారు. ఈ అలవాటు మరీ డేంజర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిపుణుల ప్రకారం.. లేవగానే టీ త్రాగడం.. టిఫిన్ లేదా భోజనం చేసిన తర్వాత టీ త్రాగడం వలన మన శరీరంలో ఐరన్ లోపానికి దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అల్పాహారం లేదా భోజనంతో పాటు, అలాగే భోజనం చేసిన వెంటనే టీ తాగడం వల్ల ఆహారంలోని ఐరన్ను శరీరం గ్రహించే శక్తి గణనీయంగా తగ్గిపోతుంది. టీలో ఉండే ‘టానిన్లు’, ‘పాలిఫెనాల్స్’ అనే సహజ సమ్మేళనాలు మనం తినే ఆకుకూరలు, పప్పుధాన్యాలు, విత్తనాలలో ఉండే ‘నాన్-హీమ్’ ఐరన్తో బంధం ఏర్పరుచుకుంటాయి. దీనివల్ల జీర్ణవ్యవస్థ ఐరన్ను సరిగ్గా పీల్చుకోలేదు. అయితే మాంసాహారం నుంచి లభించే ఐరన్పై టీ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. భారతదేశంలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం ఇప్పటికే మహిళలు, చిన్నారుల్లో రక్తహీనత తీవ్రంగా ఉంది. ఇలాంటి సమయంలో టీ తాగే సమయంపై అవగాహన లేకపోతే ఐరన్ లోపం మరింత ఎక్కువయ్యే ప్రమాదముంది. శరీరంలో ఐరన్ తగ్గితే తీవ్రమైన అలసట, నీరసం, ఏకాగ్రత లోపించడం, చర్మం పాలిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి టీని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. భోజనానికి, టీ తాగడానికి మధ్య కనీసం 1 నుంచి 2 గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. అలాగే ఆకుకూరలతో పాటు నిమ్మ, ఉసిరి వంటి విటమిన్-సి లభించే ఆహారాన్ని తీసుకుంటే ఐరన్ శోషణ పెరుగుతుంది. తాగే సమయాన్ని కాస్త సర్దుబాటు చేసుకుంటే టీ ప్రయోజనాలను పొందుతూనే ఐరన్ లోపాన్ని సులభంగా అరికట్టవచ్చు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
