Breaking: ఇకపై ప్రత్యక్ష ప్రసారం కానున్న టీటీడీ బోర్డు సమావేశాలు
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ బోర్డు మీటింగ్ని ఇకపై ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ బోర్డు మీటింగ్ని ఇకపై ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఇకపై టీటీడీలో జరిగే అన్ని బోర్డు మీటింగ్లను అసెంబ్లీ సమావేశాల మాదిరి ఎస్వీబీసీ ఛానెల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ఆయన తెలిపారు. బోర్డు మీటింగ్లో జరిగే చర్చ అంతా పారదర్శకంగా ప్రజలందరికీ తెలియాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇక సమావేశం అనంతరం వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో ఉద్యోగులందరికీ స్వాబ్ టెస్టులు చేయిస్తున్నామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో తిరుమలలో ఎలాంటి ప్రత్యేక సేవ కార్యక్రమాలు చేయాలని అనుకోవడం లేదని అన్నారు. ఆన్లైన్లో కల్యాణోత్సవం ఎలా చేయొచ్చన్న దానిపై నిర్ణయం తీసుకున్నామని, త్వరలోనే ఆన్లైన్ కల్యాణోత్సవం తేదీ వివరాలను ప్రకటిస్తామని వెల్లడించారు. అలాగే తిరుమల కొండపై కర్ణాటక సత్రం నిర్మాణం విషయంలో నిర్ణయం తీసుకున్నామని.. ఏడున్నర ఎకరాల భూమిలో నిర్మాణాల కోసం రెండువందల కోట్లు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుందని ఆయన తెలిపారు. దీనికి సంబంధించి కర్ణాటక సీఎం యడ్యూరప్పతో శుక్రవారం బెంగళూరులో భేటీ అయినట్లు వివరించారు.
ఏపీ సీఎం జగన్తో కలిసి, కర్ణాటక సీఎం యడ్యూరప్ప కర్ణాటక సత్ర నిర్మాణం ప్రారంభించనున్నారని తెలిపారు. ఇక కొండపై ప్రైవేట్ గెస్ట్ హౌజుల కేటాయింపు విషయంలో కొత్త పాలసీ తీసుకురాబోతున్నామని.. సీఎం జగన్ ఆదేశాలతో గెస్ట్ హౌజులు కేటాయింపుపై ఆన్లైన్లో బిడ్డింగ్ సిస్టమ్ పెడుతున్నామని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఎవరు ఎక్కువ స్వామి వారికి విరాళం ఇస్తారో వారికి ప్రైవేట్ గెస్ట్ హౌజులు కేటాయించనున్నట్లు టీటీడీ చైర్మన్ వివరించారు.