
జాతకాలు, చిలుక జోస్యాలను గుడ్డిగా నమ్మితే ఎంతటి విద్యావంతులైనా ఎలా మోసపోతారో చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ. ట్రాన్స్ఫర్ అవుతుందనే ఆశతో ఒక ఐటీ శాఖ అధికారి, చిలుక జోస్యం చెప్పే వ్యక్తిని నమ్మి ఏకంగా రూ.35 లక్షల విలువైన ఆభరణాలను పోగొట్టుకున్నారు. ఈ విస్తుపోయే ఘటన బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని ఆదాయపు పన్ను శాఖలో పనిచేస్తున్న ఒక ఉన్నతాధికారి, గత డిసెంబర్లో భారతీనగర్లోని శ్రీ సర్కిల్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తుండగా శేఖర్ అనే చిలుక జోస్యం చెప్పే వ్యక్తి పరిచయమయ్యాడు. ఆ అధికారికి తన మాటలతో మాయ చేసిన శేఖర్.. నీ జాతకం చాలా బాగుందని, అయితే కొన్ని దోషాలు ఉన్నాయని నమ్మించాడు.
జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే ప్రత్యేక పూజలు చేయాలని శేఖర్ సూచించాడు. దీనికోసం మొదట రూ.50 వేలు వసూలు చేశాడు. ఆ తర్వాత కూడా రకరకాల కారణాలతో పదే పదే ఫోన్ చేస్తూ అధికారి నుండి డబ్బులు లాగుతూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే తనకు కావలసిన ప్రాంతానికి బదిలీ ఎప్పుడు అవుతుందని ఆ అధికారి శేఖర్ను అడిగారు.
బదిలీ కావాలంటే ఒక పెద్ద పూజ చేయాలని, అందుకు ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలన్నీ తీసుకురావాలని శేఖర్ నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన అధికారి.. సుమారు 194 గ్రాముల బంగారు ఆభరణాలు, 1 కిలో 300 గ్రాముల వెండిని (మొత్తం విలువ రూ. 35 లక్షలు) శేఖర్కు అప్పగించారు. పూజ పూర్తికాగానే ఒక రోజులోనే తిరిగి ఇచ్చేస్తానని శేఖర్ హామీ ఇచ్చాడు.
వారం రోజుల పాటు పూజ ఇంకా పూర్తి కాలేదు అని కాలయాపన చేసిన శేఖర్, ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. అనుమానం వచ్చిన అధికారి భారతీనగర్లోని అతను జోస్యం చెప్పే ప్రాంతానికి వెళ్లి చూడగా.. అక్కడ శేఖర్ గానీ, అతని చిలుక గానీ లేవు. తానే మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే భారతీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని తమిళనాడులో అరెస్ట్ చేశారు. ఇంకా ఎవరినైనా మోసం చేశాడా అనే కోణంలో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా విద్యావంతులైన అధికారులు కూడా ఇలాంటి మూఢనమ్మకాలతో మోసపోవడం ఇప్పుడు నగరంలో చర్చనీయాంశంగా మారింది.