
వర్షాకాలం వచ్చిదంటే చాలు పాముల సంచారం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా జనావాసాల్లోకి విషసర్పాలు వచ్చేస్తూ ఉంటాయి. అయితే సాధారణంగా ఒక్క పాము కనిపిస్తేనే భయంతో చెమలు పట్టేస్తాయి. అలాంటి ఒకే ఇంట్లో నలభై నాగుపాములు ఉంటే.. ఆ ఇంట్లో వాళ్ల పరిస్థితి ఏంటో ఊహించుకోండి. వింటుంటేనే వణుకు పుడుతుంద కదూ.. అయితే ఈ ఘటన నిజంగానే జరిగింది.
మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లాలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఒక ఇంట్లో ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 40 నాగుపాము పిల్లలు బయటపడటంతో గ్రామస్థులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. రామ్టెక్ సమీపంలోని నేర్లా గ్రామంలో రాజు ధోమానే అనే వ్యక్తి ఇంట్లో పాముల పిల్లలు కనిపించడంతో కుటుంబ సభ్యులు కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు ఎంతో జాగ్రత్తగా ఒక్కో నాగుపాము పిల్లను పట్టుకుని మొత్తం 40 పాములను సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం అటవీ శాఖ అధికారుల సమక్షంలో వాటిని అడవిలో వదిలిపెట్టారు. అయితే ఒకే ఇంట్లో ఇంత పెద్ద సంఖ్యలో నాగుపాము పిల్లలు ఎలా వచ్చాయి? వాటి తల్లి పాము ఇంకా అక్కడే ఉందా? అనే ప్రశ్నలు స్థానికులను కలవరపెడుతున్నాయి. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర భయాందోళన నెలకొంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి