Telangana: ప్రతి పౌరుడికి సమగ్ర సంక్షేమ కార్డు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

తెలంగాణలో ప్రతి పౌరుడు పొందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలను ఒకే చోట అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ‘సమగ్ర సంక్షేమ కార్డు’ (యూనిఫైడ్ కార్డ్) తీసుకురానుంది. ఈ కార్డు ద్వారా లబ్ధిదారుడు ఏ శాఖ నుంచి, ఏ పథకం కింద, ఎంత మేర ప్రయోజనం పొందుతున్నాడో పూర్తి సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది. అన్ని శాఖల లబ్ధిదారుల డేటాను సమీకరించి పారదర్శకంగా సంక్షేమ సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ కార్డు అమల్లోకి వస్తే సంక్షేమ పథకాల నిర్వహణ మరింత సమర్థవంతంగా మారే అవకాశం ఉంటుందన్నారు.

Telangana: ప్రతి పౌరుడికి సమగ్ర సంక్షేమ కార్డు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Telangana CM Revanth Reddy

Updated on: May 28, 2026 | 5:49 PM

హైదరాబాద్ (28 మే, 2026): తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండేలా సమగ్ర సంక్షేమ కార్డును (యూనిఫైడ్ కార్డ్ ) రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏ పౌరుడికి ఏ శాఖ ద్వారా, ఏ పథకం కింద, ఎంత మేర లబ్ధి చేకూరుతోందో ఈ కార్డ్ ద్వారా స్పష్టంగా తెలిసేలా ఉండాలని సూచించారు. తక్షణమే అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, అన్ని శాఖల నుంచి లబ్ధిదారుల డేటాను సేకరించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ రామకృష్ణారావు, సీఎం స్పెషల్ సెక్రటరీ బి.అజిత్ రెడ్డి, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి తదితర ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం ఈ విషయాన్ని ప్రత్యేకంగా చర్చించారు.

సమగ్ర సంక్షేమ కార్డ్ ద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరుడి పూర్తి సంక్షేమ ప్రొఫైల్ ఒకేచోట అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ డేటాను అన్ని కోణాల్లో ఏఐ సహాయంతో విశ్లేషిస్తే సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పెరుగుతుందన్నారు. నిజమైన అర్హులకు పథకాలు మరింత ఖచ్చితంగా చేరుతాయన్నారు. అదే సమయంలో అనర్హులను గుర్తించడం సులభమవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రతి శాఖ వేర్వేరుగా కార్డులు ఇచ్చే పద్ధతికి బదులు, ఐటీ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర సంక్షేమ కార్డ్ ఉండాలని సీఎం సూచించారు. టెక్నాలజీపై పట్టున్న, చురుగ్గా పనిచేసే యువ ప్రభుత్వ అధికారులను ఈ ప్రక్రియకు వినియోగించాలని చెప్పారు.

ఈ కార్డ్‌లో ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి, ఫీజు రీయింబర్స్‌మెంట్, కార్మిక శాఖ, విద్యా శాఖ, ఇన్సూరెన్స్ పథకాలు, ప్రభుత్వం తీసుకువస్తున్న బీమా పథకాల వివరాలు ఉండాలని చెప్పారు. అవసరమైతే ఆధార్ నంబర్‌ తరహాలో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక యూనిక్ ఐడెంటిటీ నంబర్‌ ఇచ్చేలా ఆలోచించాలన్నారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే వివరాలను కూడా ఈ కార్డ్‌కు అనుసంధానించాలన్నారు.

లబ్ధిదారుల వివరాలతో పాటు వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య, ఇతర వివరాలను సేకరించాలని ఐటీ శాఖను ఆదేశించారు.  ఏఐ ఆధారిత ప్రొఫైలింగ్ ఉండాలని సీఎం సూచించారు ఎక్కడైనా మరణ ధృవీకరణ పత్రం జారీ అయితే, ఆ సమాచారం చేయూత పెన్షన్ డేటాబేస్‌కు చేరాలని, వెంటనే దాని ఆధారంగా చర్యలు మొదలయ్యేలా ఉండాలన్నారు. ప్రజల ఆరోగ్య ప్రొఫైల్‌ను కూడా సమగ్ర సంక్షేమ కార్డ్ తో లింక్ చేయాలని చెప్పారు.

కేరళ నుంచి గల్ఫ్‌కు వలస వెళ్లే ఉద్యోగులకు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలతో పాటు, పాస్‌పోర్ట్‌లు, వీసాల జారీకి సంబంధించిన సమాచారం ఒకేచోట అందుబాటులో ఉంచితే, అనధికార ఏజెంట్ల ప్రమేయం తగ్గుతుందని తెలిపారు. పేదలకు సంక్షేమ ఫలాలు ఖచ్చితంగా చేరేలా, ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం ప్రభావాన్ని అంచనా వేసేలా సమగ్ర సంక్షేమ కార్డ్ ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Follow Us