
హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు చేపట్టిన చర్యలు కలకలం రేపుతున్నాయి. సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించిన వ్యవహారంలో లంచం తీసుకుంటుండగా ఓ సెక్షన్ ఆఫీసర్తో పాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
సచివాలయ ఆవరణలోని టెంపుల్ వద్ద లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నట్లు తెలుస్తోంది. సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించి రూ.2 లక్షల ప్రయోజనం కల్పించే విషయంలో రూ.లక్ష లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీకి ఫిర్యాదు అందినట్లు సమాచారం. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. పక్కా ప్రణాళికతో ట్రాప్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రూ.లక్ష లంచం తీసుకుంటున్న సమయంలో సచివాలయంలో పనిచేస్తున్న సెక్షన్ ఆఫీసర్ వినోద్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగి రాఘవేంద్ర పాత్ర కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో వినోద్తో పాటు రాఘవేంద్రను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలింపు
ట్రాప్ అనంతరం ఇద్దరినీ హైదరాబాద్లోని నాంపల్లిలో ఉన్న ఏసీబీ కార్యాలయానికి తరలించినట్లు తెలుస్తోంది. అక్కడ వారిని అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం. లంచం డిమాండ్కు సంబంధించిన వివరాలు, ఈ వ్యవహారంలో మరెవరైనా ప్రమేయం ఉందా? అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించిన దరఖాస్తు, దాని ప్రాసెసింగ్, లబ్ధిదారుడికి అందాల్సిన ఆర్థిక సాయం తదితర అంశాలపై కూడా ఏసీబీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.
రాష్ట్ర సచివాలయంలో కలకలం
రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అత్యంత కీలకమైన కార్యాలయమైన సచివాలయ ఆవరణలోనే లంచం తీసుకుంటూ అధికారి పట్టుబడినట్లు వార్తలు రావడంతో ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, నిందితులపై నమోదు చేసిన సెక్షన్లు, ట్రాప్కు సంబంధించిన అధికారిక వివరాలను ఏసీబీ అధికారులు వెల్లడించాల్సి ఉంది. దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఈ వ్యవహారంలో మరెవరైనా ప్రమేయం ఉందా? లంచం డిమాండ్ వెనుక పూర్తి నేపథ్యం ఏమిటి? అనే విషయాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..