
మహాలక్ష్మీ పధకం కింద మహిళలకు అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణంలో పలు కీలక మార్పులు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోందట. రవాణా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు.. అత్యాధునిక సాంకేతికతను జోడించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ‘స్మార్ట్ కార్డు’లను పంపిణీ చేయాలని ఆలోచిస్తోంది. తొలి దశలో వీటిని మహాలక్ష్మీ పధకంలో అమలు చేయనుంది. మహిళల కోసం ప్రత్యేకంగా కామన్ మొబిలిటీ కార్డులను జరీ చేయనుంది. ఈ కార్డులను రూపొందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్తో ఒప్పందం కుదుర్చుకుంది.
కామన్ మొబిలిటీ కార్డులు కేవలం బస్సు పాస్ మాత్రమే కాకుండా.. మల్టీ పర్పస్ డిజిటల్ వాలెట్ కింద ఉపయోగించేలా రూపకల్పన చేస్తున్నారు. ఈ కార్డు ద్వారా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయడమే కాకుండా.. ఇందులో మనీ లోడ్ చేసి మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లలో కూడా ప్రయాణం చేయవచ్చు. భవిష్యత్తులో ఇదే కార్డుకు రేషన్, ఆరోగ్య సేవలు, ఇతర ప్రభుత్వ పధకాలను కూడా అనుసంధానం చేయాలనేది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్డు ఉంటే.. ఇకపై ప్రయాణీకులు ఆధార్ కార్డును ప్రతీసారి తమ వెంట తీసుకెళ్ళాల్సిన పని ఉండదు. ఈ కార్డుల ద్వారా ప్రతీ ప్రయాణం ఇక డిజిటల్గా రికార్డు అవుతుంది కాబట్టి.. దానికి తగ్గట్టుగా రద్దీ ఉన్న ప్రాంతాల్లో మరిన్ని బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ భావిస్తోంది. అలాగే ఈ డిజిటల్ కార్డుల ద్వారా రవాణా వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని అనుకుంటోంది. కాగా, రాష్ట్ర ప్రజలందరికీ ఈ స్మార్ట్ కార్డులను అందుబాటులోకి తీసుకొస్తే.. తెలంగాణ డిజిటల్ విప్లవానికి ఇదే నాంది కానుంది. అటు ఇప్పటివరకు మహాలక్ష్మీ పధకం కింద సుమారు సుమారు 255 కోట్ల ఉచిత ప్రయాణాలు జరగగా.. ప్రభుత్వం రూ. 8,500 కోట్లను ఆర్టీసీకి ఇచ్చింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..