CM KCR: దత్తత గ్రామం వాసాలమర్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్.. దళిత వాడలో ప్రతి ఇంటిని పరిశీలించిన సీఎం
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తన దత్తత గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిలో పర్యటించారు.
CM KCR Vasalamarri visit: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తన దత్తత గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిలో పర్యటించారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల సమయంలో వాసాలమర్రికి చేరుకున్న సీఎం కేసీఆర్.. దళితవాడలో అధికారులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ పరిశీలించారు. వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు దళితుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. దళితవాడలో పర్యటన ముగిసిన అనంతరం.. గ్రామమంతా కలియ తిరుగుతూ పారిశుద్ధ్య చర్యలను పరిశీలించారు.
అనంతరం రైతు వేదిక భవనంలో ఏర్పాటుచేసిన సమావేశంలో గ్రామాభివృద్ధిపై స్థానికులతో చర్చించనున్నారు. గత నెలలలో వాసాలమర్రి పర్యటన సందర్భంగా తాను ఇచ్చిన హామీల అమలుతీరుపై ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్షించనున్నారు. తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలకు దిశానిర్దేశం చేస్తారు సీఎం. వాసాలమర్రి గ్రామానికి సీఎం కేసీఆర్ రావడం ఇది రెండోసారి. కాగా, గత జూన్ 22న తొలిసారిగా వాసాలమర్రికి వచ్చిన ముఖ్యమంత్రి.. గ్రామస్థులతో కలిసి గ్రామాభివృద్ధిపై చర్చించి అనంతరం సహపంక్తి భోజనం చేశారు. 42 రోజుల తర్వాత సీఎం మరోసారి గ్రామానికి వచ్చారు.
Read Also…