Konda Surekha: అర్ధరాత్రి కొండా సురేఖ సంచలన ట్వీట్.. నాగార్జునతో వివాదంపై ఏమన్నారంటే..?..

కేటీఆర్‌పై విమర్శల సందర్భంగా నాగచైతన్య-సమంత విడాకులను ప్రస్తావించి వివాదంలో చిక్కుకున్నారు మంత్రి కొండా సురేఖ. ఇప్పటికే నాగార్జున వేసిన పరువు నష్టం దావా కోర్టులో నడుస్తుండగా... అర్ధరాత్రి ఆమె సంచలన ట్వీట్ చేశారు. మరి ఈ ట్వీట్‌తో ఈ వివాదం ముగుస్తుందా..? లేదా..? అసలు ఆ ట్వీట్ ఏంటీ..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం

Konda Surekha: అర్ధరాత్రి కొండా సురేఖ సంచలన ట్వీట్.. నాగార్జునతో వివాదంపై ఏమన్నారంటే..?..
Minister Konda Surekha Tweet

Updated on: Nov 12, 2025 | 7:35 AM

మంత్రి కొండా సురేఖ – అక్కినేని నాగార్జున వివాదం ఎపిసోడ్ కీలక మలుపు తిరిగింది. కొండా సురేఖ వ్యాఖ్యలపై ఇప్పటికే నాగార్జున పరువునష్టం దావా వేయగా.. ప్రస్తుతం అది కోర్టులో నడుస్తుంది. ఈ క్రమంలో మంత్రి అర్ధరాత్రి సంచలన ట్వీట్ చేశారు. గతంలో నాగార్జున కుటుంబంపై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నట్లు అర్థరాత్రి ట్వీట్ చేశారు. నాగార్జున వేసిన పరువు నష్టం దావా నేపథ్యంలో మంత్రి చేసిన ఈ పశ్చాత్తాప ప్రకటన చర్చనీయాంశమైంది.

నాకు ఆ ఉద్దేశం లేదు..

అర్థరాత్రి 12 గంటలు దాటిన తర్వాత కొండా సురేఖ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ క్షమాపణ లేఖను పోస్ట్ చేశారు. నాగార్జున, ఆయన కుటుంబాన్ని కించపరచాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యల వల్ల వారు బాధపడి ఉంటే, అందుకు తాను చింతిస్తున్నట్లు తెలిపారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

వివాదానికి కారణం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై విమర్శలు చేసే సమయంలో మంత్రి కొండా సురేఖ నాగచైతన్య – సమంత విడాకులను ప్రస్తావించారు. కేటీఆర్ వల్లే వారు విడాకులు తీసుకున్నారని ఆరోపించారు. ఈ కామెంట్స్ రాజకీయంగా పెద్ద దుమారం రేపాయి. మంత్రి వ్యాఖ్యలను అక్కినేని ఫ్యామిలీ తీవ్రంగా ఖండించింది. తన కుటుంబ పరువుకు నష్టం కలిగించారంటూ నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా వేశారు. ఈ క్షమాపణను నాగార్జున కుటుంబం ఎలా స్వీకరిస్తుంది, పరువు నష్టం దావాపై తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయనేది వేచి చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.