Hyderabad Water Crisis: హైదరాబాద్ అవసరాలకు సరిపడా నీరు.! అవసరం అయితే ఎమర్జెన్సీ పంపింగ్
ఈ వేసవిలో హైదరాబాద్ మహానగర ప్రజల తాగు నీటి అవసరాలకి సరిపడా నిల్వలు ఉన్నాయని.. అందువల్ల నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని జలమండలి స్పష్టం చేస్తోంది. ప్రధాన జలాశయాలైన నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో సరిపడా నీరు లేనందున.. నగర వాసులకు తాగునీటి సమస్య తలెత్తుతుందని కొన్ని వార్తా పత్రికలు కథనాలు ప్రచురించాయి. ఈ నేపథ్యంలో జలమండలి ఈ విషయంపై..
ఈ వేసవిలో హైదరాబాద్ మహానగర ప్రజల తాగు నీటి అవసరాలకి సరిపడా నిల్వలు ఉన్నాయని.. అందువల్ల నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని జలమండలి స్పష్టం చేస్తోంది. ప్రధాన జలాశయాలైన నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో సరిపడా నీరు లేనందున.. నగర వాసులకు తాగునీటి సమస్య తలెత్తుతుందని కొన్ని వార్తా పత్రికలు కథనాలు ప్రచురించాయి. ఈ నేపథ్యంలో జలమండలి ఈ విషయంపై క్లారిటీ ఇస్తుంది.
ఓఆర్ఆర్ వరకు విస్తరించిన హైదరాబాద్ మహా నగర వాసుల తాగునీటి అవసరాల కోసం జలమండలి.. నాగార్జున సాగర్ జలాశయం, అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్ – 1, 2, 3 ల ద్వారా రోజుకి 270 ఎంజీడీల నీటిని తరలిస్తోంది. ఈ లెక్కన నెలకు 1.38 టీఎంసీల నీటిని సరఫరా చేస్తుంది. అయితే ఈ రోజు (తేది: 12.03.2024) నాటికి నాగార్జున సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 138.73 టీఎంసీ, 514.10 అడుగులు ఉంది. గతేడాది ఇదే రోజున 187.07 టీఎంసీలు, 539.40 అడుగుల నీరు ఉంది. ప్రస్తుతం రిజర్వాయర్ లో డెడ్ స్టోరేజీ లెవల్ పైన (510 అడుగుల పైన) 7.06 టీఎంసీల నీటి లభ్యత ఉంది. కాబట్టి.. ఈ వేసవిలో హైదరాబాద్ నగరానికి తాగునీటి కొరత ఉండదు.
జలమండలి అధికారులు ఎప్పటికప్పుడు ప్రాజెక్టు పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నారు. నగరానికి అవసరమైన 270 ఎంజీడీల నీరు సరఫరా చేయడానికి ఎలాంటి ఆటంకాలు ఉండవు. రానున్న నాలుగు నెలల వరకు అనగా ఈ జులై చివరి నాటికి కావాల్సిన నీరు సరఫరా చేసేందుకు ఎమర్జెన్సీ పంపింగ్ ఏర్పాట్ల పనులు పూర్తి కావస్తున్నాయి. జలాశయంలో నీటి మట్టం 510 అడుగులకు చేరగానే.. ఈ ఎమర్జెన్సీ పంపింగ్ ద్వారా హైదరాబాద్ కు సరిపడా నీటిని సరఫరా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని జలమండలి తెలిపింది.
మరోవైపు గోదావరి జలాల కోసం ఎల్లంపల్లి జలాశయంలో డెడ్ స్టోరేజీ నుంచి నీటిని తరలించేందుకు అత్యవసర పంపింగ్ చేయడానికి అవసరమైన ప్రక్రియ మొదలు పెట్టింది. దీంతో పాటు అవసరాన్ని బట్టి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాల నుంచి అదనపు జలాలను తరలించేందుకు సమాయత్తమవుతోంది. ఇవే కాకుండా.. సింగూరు, మంజీరా జలాశయాల్లో సంతృప్తికరమైన నీటి నిల్వలు ఉన్నాయి. కాబట్టి.. తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందువల్ల నగర ప్రజలు ఎలాంటి ఆందోళనలకు గురి కావద్దని జలమండలి విజ్ఞప్తి చేస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి