
కొమురంభీం ఆసిపాబాద్ జిల్లా అమాయకపు ఆదివాసీల నేల. పోడు వ్యవసాయం తప్ప మరో ఆధారం లేని ప్రాంతం. ఏజేన్సీలో జీవనం సాగిస్తున్న అమాయకులైన ఆదివాసీ యువతులు, అమ్మాయిలు, మహిళలను టార్గెట్ గా చేసుకున్న ఓ ముఠా.. డబ్బులు ఆశ చూపి.. అందమైన జీవితం ఉంటుందని మాయమాటలు చెప్పి.. పెళ్లి పేరుతో ఇతర రాష్ట్రాలకు అక్రమంగా అమ్మేస్తోంది. జిల్లాకు చెందిన ఏజేన్సీ గ్రామాల్లోని ఇద్దరు మహిళలను పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి మధ్యప్రదేశ్కు చెందిన ఓ ముఠాకు విక్రయించి సొమ్ము చేసుకున్న అంతరాష్ట్ర ముఠాను ఆసిఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపుతోంది. బెజ్జూర్ టూ మధ్యప్రదేశ్ వయా మహారాష్ట్ర.. మానవ అక్రమ రవాణా ముఠా రూట్ ఇది. మైనర్ బాలిక అయితే ఓ రేటు వివాహం అయిన అమ్మాయి అయితే మరో రేటు. ఒంటరి మహిళ అయితే ఇంకో రేటు.. ఇలా అంగట్లో సరుకుల్లా గిరిజన యువతలును పక్క రాష్ట్రాల కు అమ్మేస్తోంది ఈ ముఠా.
గతంలోను ఓ ముఠా ఇదే జిల్లాలోని గిరిజన మహిళలు యువతలును మధ్యప్రదేశ్కు అక్రమంగా తరలించింది. గత ఏడాది జూలైలో కొమురం భీం అసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని వాడిగొంది గ్రామానికి చెందిన ఓ యువతిని పెళ్లి పేరిట లక్ష 30 వేలకు కొనుగోలు చేసి మధ్యప్రదేశ్కు తరలించింది. అక్కడికి చేరుకున్న ఆ యువతిని మధ్యప్రదేశ్ వ్యభిచార కూపానికి తరలించారు ముఠా సభ్యులు. ఆధార్ కార్డ్ అడ్రస్ మార్పుతో ఆ యువతి అక్రమ రవాణా గుట్టు రట్టైంది. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. జిల్లాలో కానిస్టేబుల్గా పని చేసిన హరిదాసుతో పాటు మంచిర్యాలకు చెందిన పరికిపండ్ల విజయ లక్ష్మి, ఆసిఫాబాద్కు చెందిన సత్యం శెట్టి సుజాత , పంచపూల బైర, వాంకిడికి చెందిన తాడూరి ఉష , మంచిర్యాల కు చెందిన దుర్గం సుధాకర్ లు ముఠాగా ఏర్పడి మహిళలను మాయ చేసి మధ్యప్రదేశ్కు చెందిన బసీర్ రమేష్ గౌడ్, సురేఖ, సోని జగదీష్ ముఠాతో చేతులు కలిపి జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలను అక్రమంగా అమ్మేసినట్టు జిల్లా పోలీసులు తేల్చారు.
తాజాగా ఇదే జిల్లాలో మరో కేసు వెలుగు చూడటం సంచలనంగా మారింది. కొమురంభీం జిల్లా బెజ్జూర్ మండలానికి చెందిన ఇద్దరు గిరిజన యువతులను మాయమాటలు చెప్పి మధ్యప్రదేశ్ లో విక్రయించినట్టు తేలింది. ఒక్కో మహిళకు 2.5 లక్షలు వెచ్చించి అమ్మేసినట్టు పోలీసులు గుర్తించారు. అక్రమ రవాణా ముఠాలోని ముగ్గురు సభ్యులను జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.