Telangana Elections: ఎవరికి జై.. ఎవరికి నై.. ఆయనొస్తే ఈయన పరిస్థితి ఏంటి.. జనగామ బీఆర్‌ఎస్‌ పార్టీలో కొత్త చర్చ..

BRS Janagama Ticket: పార్టీ తనను అవమానించిందంటూ.. కనీసం టికెట్ కూడా ఇస్తారన్న గ్యారంటీ లేదంటూ హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఆ వెంటనే అలెర్టయిన గులాబీ పార్టీ..పొన్నాలను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. స్వయంగా పొన్నాల ఇంటికి వెళ్లిన మంత్రి కేటీఆర్..పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. జనగామలో పొన్నాల ఎపిసోడ్‌ ఎవరూ ఊహించనిది. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయడం..చకచకా బీఆర్‌ఎస్‌వైపు అడుగులు వేయడం కూడా జరిగిపోయింది. అందులో..

Telangana Elections: ఎవరికి జై.. ఎవరికి నై.. ఆయనొస్తే ఈయన పరిస్థితి ఏంటి.. జనగామ బీఆర్‌ఎస్‌ పార్టీలో కొత్త చర్చ..
Brs Janagama Ticket

Updated on: Oct 15, 2023 | 11:02 AM

జనగామలో పొన్నాల లక్ష్మయ్య ఎపిసోడ్‌ ఊహించని పరిణామం. సీఎం కేసీఆర్‌ సహా పల్లా రాజేశ్వర్, చివరకు పొన్నాల కూడా ఊహించలేదు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఆయనే హాట్‌ టాపిక్‌. మరీ కారుపార్టీలో చేరబోతున్న పొన్నాల ఫ్యూచర్ ఏంటనే లెక్కలు వేసుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సుమారు 4 దశాబ్దాల పాటు కాంగ్రెస్‌ పార్టీకి సేవలందించిన పొన్నాల.. కొన్ని అనూహ్య పరిణామాల వల్ల ఆ పార్టీని వీడారు.

పార్టీ తనను అవమానించిందంటూ.. కనీసం టికెట్ కూడా ఇస్తారన్న గ్యారంటీ లేదంటూ హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఆ వెంటనే అలెర్టయిన గులాబీ పార్టీ..పొన్నాలను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. స్వయంగా పొన్నాల ఇంటికి వెళ్లిన మంత్రి కేటీఆర్..పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. జనగామలో పొన్నాల ఎపిసోడ్‌ ఎవరూ ఊహించనిది. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయడం..చకచకా బీఆర్‌ఎస్‌వైపు అడుగులు వేయడం కూడా జరిగిపోయింది. అందులో బీఆర్‌ఎస్‌ కూడా జనగామ అభ్యర్థిని ఇంతవరకూ ప్రకటించలేదు.

పల్లాకు మార్గం సుగమం అయ్యేలా..

సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో అధిష్ఠానం చర్చలు జరిపి, అక్కడి నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని బరిలో దించాలని భావించింది. ఆ దిశగా ముత్తిరెడ్డికి ఆర్టీసీ ఛైర్మన్‌ పదవి ఇచ్చి, పల్లాకు మార్గం సుగమం అయ్యేలా ప్లాన్‌ చేశారు. ఇక మంత్రి హరీష్‌రావు సమక్షంలోనే పల్లాను లక్షా మెజార్టీతో గెలిపించాలని గులాబీ కేడర్‌కి పిలుపునిచ్చారు ముత్తిరెడ్డి. అప్పటి నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి నియోజకవర్గమంతా తిరుగుతూ ప్రచారం కూడా మొదలుపెట్టారు.

అందర్నీ ఆలోచనలో పడేసేలా..

ఈ నేపథ్యంలో పొన్నాల రాజీనామా ఎపిసోడ్‌ అందర్నీ ఆలోచనలో పడేసేలా చేసింది. అందునా ముందే నిర్ణయించిన ప్రకారం రేపు జనగామలో సీఎం కేసీఆర్‌ బహిరంగసభ కూడా జరగబోతోంది. అదే సభలో పొన్నాల బీఆర్ఎస్‌ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. అదే జరిగితే వేదికపై నుంచే సీఎం కేసీఆర్‌ జనగామ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ప్రకటిస్తారా..? ఒకవేళ ప్రకటిస్తే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య ఇద్దరిలో ఎవరికి ఛాన్స్ దక్కవచ్చనేది ఆసక్తి రేపుతోంది.

కాంగ్రెస్‌లో బీసీలకు అన్యాయం జరుగుతోందనే కారణంతోనే పొన్నాల లక్ష్మయ్య ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీసీ వర్గానికి చెందిన పొన్నాల బీఆర్‌ఎస్‌లో చేరితే జనగామ టిక్కెట్‌ ఇవ్వాలని కోరుతారా..? మరేదైనా పదవిని పొన్నాలకు కట్టబెడతారా ? పల్లా పరిస్థితి ఏంటి..? మొత్తానికి జనగామ అభ్యర్థి ప్రకటనపై బీఆర్‌ఎస్‌ ఏ నిర్ణయం తీసుకోబోతోందనేది సర్వత్రా ఆసక్తి రేపుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..