ప్రజా ఆరోగ్యంపై సర్కార్ సంచలన నిర్ణయం.. “సురక్షిత తెలంగాణ కోసం TG-Safe” రక్షణ కవచం!

తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యం కోసం 'TG-Safe' అథారిటీని ప్రారంభించింది. ఆహార భద్రత, ఔషధ నియంత్రణ విభాగాలను సమన్వయం చేస్తూ, ఆహారం, ఔషధాల నాణ్యత, భద్రత, జవాబుదారీతనాన్ని పెంపొందించడం దీని లక్ష్యం. కల్తీ, నాసిరకం ఉత్పత్తులపై వేగవంతమైన చర్యలు, సురక్షిత తెలంగాణ నిర్మాణమే ఈ కొత్త వ్యవస్థ ప్రధాన ఉద్దేశం.

ప్రజా ఆరోగ్యంపై సర్కార్ సంచలన నిర్ణయం.. “సురక్షిత తెలంగాణ కోసం TG-Safe” రక్షణ కవచం!
Cm Revanth Reddy Launches Tg Safe

Updated on: Aug 17, 2026 | 5:08 PM

తెలంగాణలో ఆహారం, ఔషధాల నాణ్యత ప్రమాణాలను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆహార భద్రత, ఔషధ నియంత్రణ విభాగాలను సమన్వయం చేస్తూ తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (TG-Safe)ను ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. పౌరుల ఆరోగ్యం, భద్రత, శ్రేయస్సుకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ఈ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

ఆహారం, ఔషధాల విషయంలో నాణ్యతా ప్రమాణాలు, భద్రత, జవాబుదారీతనాన్ని మరింత పెంచడమే TG-Safe ప్రధాన ఉద్దేశమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు వేర్వేరు విభాగాల పరిధిలో కొనసాగుతున్న ఆహార భద్రత, ఔషధ నియంత్రణ కార్యకలాపాలను ఒకే వ్యవస్థ కిందకు తీసుకువచ్చారు. దీని ద్వారా పర్యవేక్షణ మరింత సమర్థవంతంగా జరిగే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

TG-Safe ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. ప్రజా ప్రభుత్వం పౌరుల భద్రత, రక్షణ, శ్రేయస్సుకు జీవితంలోని ప్రతి అంశంలోనూ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. చట్టబద్ధమైన పాలనను స్థాపించడం, దానిని పునరుద్ఘాటించడం, జవాబుదారీతనాన్ని పాటించడం తమ ప్రభుత్వ ప్రగాఢ నిబద్ధత అని పేర్కొన్నారు. ప్రజలకు సురక్షితమైన తెలంగాణను అందించడంలో TG-Safe కీలకంగా పనిచేస్తుందని ఆయన అన్నారు.

ఇదిలా ఉండగా, TG-Safe కమిషనర్‌గా అవినాశ్ మహంతి సోమవారం (ఆగస్టు 17) బాధ్యతలు స్వీకరించారు. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వం ఆహార భద్రత, ఔషధ నియంత్రణ విభాగాలను సమన్వయం చేసి TG-Safeగా ఏర్పాటు చేయడంతో.. ఈ కొత్త వ్యవస్థకు అవినాశ్ మహంతి నేతృత్వం వహించనున్నారు.

ఆహార పదార్థాల నాణ్యత, ఔషధాల ప్రమాణాలు, ప్రజారోగ్యానికి సంబంధించిన అంశాలపై పర్యవేక్షణను మరింత బలోపేతం చేయడం ద్వారా కల్తీ, నాసిరకం ఉత్పత్తులపై చర్యలు వేగవంతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. “సురక్షిత తెలంగాణ కోసం TG-Safe” అనే లక్ష్యంతో పనిచేసే ఈ కొత్త వ్యవస్థ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఆహారం, ఔషధాల భద్రత విషయంలో నాణ్యతా ప్రమాణాలు, పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత పెంచేందుకు TG-Safe ఎంత మేరకు ప్రభావవంతంగా పనిచేస్తుందనేది రానున్న రోజుల్లో కీలకంగా మారనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us