
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి, నియోజకవర్గాన్ని రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ప్రతినబూనారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి మరియు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి కొడంగల్ చేరుకున్న సీఎంకు ఘనస్వాగతం లభించింది. ఈ పర్యటనలో ప్రధానంగా కొడంగల్లో పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు సీఎం భూమిపూజ చేశారు. తిరుమల తరహాలోనే ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అలాగే నియోజకవర్గ ప్రజల ఆరోగ్య అవసరాల కోసం 430 పడకల భారీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వీటితో పాటు దౌల్తాబాద్ వెంకటేశ్వర స్వామి, కోస్గి వేణుగోపాలస్వామి ఆలయాల అభివృద్ధి పనులకు కూడా శ్రీకారం చుట్టారు.
శంకుస్థాపనల అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి భావోద్వేగంగా ప్రసంగించారు. తన రాజకీయ ప్రస్థానంలో కొడంగల్ కార్యకర్తల త్యాగాలను ఆయన గుర్తు చేసుకున్నారు. కొడంగల్ భూములు కృష్ణా జలాలతో తడవాలని ఆకాంక్షిస్తూ, నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఏడాదిన్నర లోపు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే వేగంగా పూర్తయ్యిందని, నిధులకు కొరత లేదని ఆయన స్పష్టం చేశారు.
ఒకప్పుడు చదువు కోసం పక్క ఊర్లకు వెళ్లే పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు కొడంగల్ను ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మెడికల్, ఇంజనీరింగ్, నర్సింగ్ కాలేజీలతో పాటు సైనిక్ స్కూల్ కూడా ఇక్కడ ఏర్పాటు అవుతున్నాయని వెల్లడించారు. అలాగే, లగచర్ల వద్ద 2,300 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్, రాబోయే ఆరు నెలల్లో సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు ద్వారా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి చెప్పారు. వికారాబాద్ రైల్వే లైన్ పనులు 90% పూర్తయ్యాయని, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కొడంగల్ వరకు భారీ రహదారిని నిర్మిస్తున్నామని ఆయన వివరించారు.
“2009లో మీరు నాటిన మొక్క ఈరోజు చెట్టుగా మారింది, ఆ చెట్టును మీరే కాపాడుకోవాలి” అని కోడంగల్ ప్రజలను కోరారు. పార్టీలకతీతంగా గ్రామాల అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. 2027 డిసెంబర్ నాటికి కొడంగల్లో చేపట్టిన అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేసి, నియోజకవర్గాన్ని బంగారు తునకగా మారుస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృఢ నిశ్చయం వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..