ATA Invitation: అమెరికా ‘ఆటా’ మహాసభలకు మాజీ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ప్రతినిధుల బృందం శనివారం మర్యాదపూర్వకంగా కలిసింది. 2026 జూలై 31, ఆగస్టు 1, 2 తేదీల్లో అమెరికాలోని మేరీల్యాండ్‌లో నిర్వహించనున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) తెలుగు మహాసభల‌కు ఆయన్ను ఆహ్వానించారు. ఈ మేరకు కేటీఆర్‌కు ఆహ్వాన పత్రికను అందజేశారు.

ATA Invitation: అమెరికా ఆటా మహాసభలకు మాజీ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం
Ktr Ata Invitation

Updated on: May 30, 2026 | 6:23 PM

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను శనివారం అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ప్రతినిధుల బృందం మర్యాదపూర్వకంగా కలిశారు. జూలై 31, ఆగస్టు 1, 2 తేదీల్లో అమెరికాలోని నిర్వహించే ఆటా మహా సభలకు ఆయన్ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆటా సభల్లో చేపట్టే వివిధ కార్యక్రమాలను ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల కలిసి కేటీఆర్‌కు కూలంకషంగా వివరించారు. ఈ భేటీలో అమెరికాలోని భారతీయుల పరిస్థితులు, అక్కడి రాజకీయాలపై ప్రత్యేకంగా చర్చించారు.

అలాగే తెలంగాణ ఉద్యమంలో ఎన్‌ఆర్‌ఐల పాత్ర, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ చేపట్టిన కార్యక్రమాలను కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. TDF అప్పటి చైర్మన్ మధు రెడ్డి నల్లగొండ ఫ్లోరైడ్ పోరాటంలో అందించిన మద్దతును కేటీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్‌ఆర్‌ఐలు అమెరికాలో ఉంటూనే ఇక్కడి ప్రజలకు ఎలా మద్దతు కూడగట్టారో ఆయన వివరించారు.

ఆటా నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేములతో రెండు దశాబ్దాలుగా తనకు ఉన్న ఉద్యమ సంబంధాన్ని కేటీఆర్ జ్ఞప్తి చేసుకున్నారు. పదేళ్ల BRS పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశానికే తలమానికంగా నిలిచిందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

అమెరికాలో జరగబోయే 19వ ఆటా మహాసభలకు హాజరయ్యేందుకు కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో అమెరికన్ తెలుగు అసోసియేష‌న్ అధ్యక్షుడు జయంత్ చల్లా, నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ తిరుమల రెడ్డి, ఈశ్వర్ రెడ్డి బండా ఉన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us