ప్రియుడే హంతకుడు..చేవెళ్ల దిశ ఘటనలో పురోగతి
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల దిశ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు..ప్రియుడే ఘాతుకానికి పాల్పడినట్లుగా నిర్ధారించారు. కేసులో ప్రధాన నిందితుడ్ని...
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లిలో వంతెన వద్ద జరిగిన మహిళ హత్య కేసులో పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. మృతురాలిది సిక్కిం రాష్ట్రంగా పోలీసులు గుర్తించారు. కాగా ఈ కేసులో ఆమె ప్రియుడే ఘాతుకానికి పాల్పడినట్లుగా విచారణలో తేల్చారు.
మార్చి 17న ఉదయం తంగడపల్లి శివారులో ఉన్న ఓ వంతెన కింద గుర్తు తెలియని యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. మహిళ శరీరంపై దుస్తులు లేకపోవడం, బండరాయితో తలపై మోది హత్యచేసిన ఆనవాళ్లు ఉండటంతో కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. మహిళ మిస్సింగ్పై సిక్కింలో కేసు కూడా నమోదైంది. అయితే.. సీసీ ఫుటేజీ, సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మృతదేహాన్ని పారేసేందుకు తీసుకొచ్చిన అద్దె కారును పోలీసులు గుర్తించారు. ఆ కారు సాయంతోనే కేసును చేధించగలిగారు పోలీసులు. కారును అద్దెకు తీసుకున్న చోట ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. వాటి ఆధారంగానే ప్రధాన నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లుగా వెల్లడించారు. కేసు పురోగతిలో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
మృతిచెందిన మహళతో నిందితుడికి ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారి తీసిందని పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దాంతో ఆవేశంలో ఆమెను హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో మరో వ్యక్తి నిందితుడి బంధువు కూడా హత్యకు సహకరించినట్లుగా పోలీసులు నిర్ధారించారు. హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని అక్కడ్నుంచి తరలించేందుకు ఓ కారును అద్దెకు తీసుకున్నారని, అర్ధరాత్రి దాటిన తర్వాత తంగడపల్లి వంతెన వద్ద మృతదేహాన్ని పారేసినట్లుగా గుర్తించారు. ఈ క్రమంలోనే యువతి ముఖంపై బండరాళ్లతో మోదీ ఒంటిపై బట్టలు లేకుండా చేసి అక్కడ్నుంచి పారిపోయినట్లుగా విచారణలో వెల్లడైంది.