
జపాన్కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా కిర్లోస్కర్ మోటార్ భారత మార్కెట్లో తన తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లాను అధికారికంగా విడుదల చేసింది. దేశంలో వేగంగా పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ను దృష్టిలో ఉంచుకుని తీసుకొచ్చిన ఈ మిడ్-సైజ్ ఎస్యూవీ, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, MG ZS EV, మారుతి సుజుకి ఇ విటారా వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ వాహనం ప్రారంభ ఎక్స్షోరూమ్ ధర రూ.23.60 లక్షలుగా నిర్ణయించారు. మారుతీ సుజుకీ ఈ-విటారా ప్లాట్ఫామ్ను ఆధారంగా చేసుకుని రూపొందించినప్పటికీ, టయోటా ప్రత్యేక డిజైన్ శైలిని ఇందులో జోడించింది.
అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా రెండు బ్యాటరీ ఎంపికల్లో అందుబాటులో ఉంటుంది. 49 kWh, 61 kWh బ్యాటరీ ప్యాక్లతో వచ్చే ఈ కారు, పెద్ద బ్యాటరీ వేరియంట్లో ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే గరిష్టంగా 543 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ వెల్లడించింది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 172 బీహెచ్పీ పవర్, 189 ఎన్ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే.. 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ను అందించారు. ఇది వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేకు మద్దతు ఇస్తుంది.
అదనంగా పనోరమిక్ సన్రూఫ్, 12 కలర్ యాంబియెంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్లెస్ ఛార్జింగ్, జేబీఎల్ ప్రీమియం సౌండ్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఇన్-క్యాబిన్ ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. భద్రత పరంగా 7 ఎయిర్బ్యాగ్లు, ఏబీఎస్, ఈబీడీ, ఈఎస్పీ, 360-డిగ్రీ కెమెరా, అలాగే లెవల్-2 అడాస్ (ADAS) సాంకేతికతను స్టాండర్డ్గా అందిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో టయోటా ప్రవేశం భారత ఈవీ మార్కెట్లో పోటీని మరింత పెంచే అవకాశముందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి