
సైబర్ సెక్యూరిటీ ఎంత పటిష్టంగా ఉన్నా నేరగాళ్లు ఏదో ఒకలా నేరాలకు పాల్పడుతూనే ఉన్నారు. చిన్నా చితకా ఉద్యోగులు, వ్యాపారులే కాదు.. అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకునే దిగ్గజ టెక్ కంపెనీలను కూడా హ్యాక్ చేస్తున్నారు. ఇటీవలే ప్రముఖ ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ తయారీదారు బోట్ కంపెనీలో ఉన్న వినియోగదారుల వ్యక్తిగత సమాచారం డార్క్ వెబ్లో అమ్మకానికి పెట్టిన ఉదంతాలు మనం చూశాం. ఇప్పుడు ఇదే కోవల ప్రముఖ ల్యాప్టాప్ తయారీ సంస్థ డెల్కు చెందిన మిలియన్ల మంది వినియోగదారుల సమాచారం లీక్ అయినట్లు వెలుగులోకి వచ్చింది. దాదాపు 5 కోట్ల మంది డెల వినియోగదారుల డేటా హ్యాకర్ల వద్ద ఉన్నట్లు పలు ఆన్లైన్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే విషయాన్ని డెల్ సంస్థ కూడా నిర్ధారించింది. అయితే దాని వల్ల భారీ నష్టం ఏమి లేదని కంపెనీ భరోసానిచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్రస్తుత స్మార్ట్ ప్రపంచంలో వ్యక్తుల డేటా లేదా వ్యక్తిగత సమాచారం అనేది ఒక విలువైన ఆస్తిగా మారింది. దీనిని అనేక రకాలుగా వినియోగించుకునే వీలుంది. అత్యంత విలువైన ఈ డేటాకు ముప్పు కూడా అదే స్థాయిలో పొంచి ఉంది. ముఖ్యంగా హ్యాకర్లు టార్గెట్ చేసే ప్రమాదం ఉంది. సైబర్ నేరగాళ్లు ప్రజల సున్నితమైన సమాచారం గల డేటాబేస్ను కొట్టేసి, వాటిని అమ్మకానికి పెడుతున్నారు. దీనివల్ల ప్రజల భద్రత ప్రమాదంలో పడుతోంది.
ల్యాప్టాప్ తయారీ సంస్థ డెల్కు చెందిన మిలియన్ల మంది వినియోగదారుల సమాచారం లీకైనట్లు వెలుగులోకి వచ్చింది. దాదాపు 5 కోట్ల మంది డెల్ వినియోగదారుల డేటా తమ వద్ద ఉందని హ్యాకర్లు పేర్కొన్నారు. ఈ లీక్ వల్ల దాదాపు 4.9 కోట్ల మంది వినియోగదారులు ప్రభావితమయ్యారని పలు నివేదిక వెల్లడిస్తున్నాయి. అయితే వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి ఆర్థిక వివరాలు లేదా పాస్వర్డ్లు సురక్షితంగా ఉన్నాయని కంపెనీ చెబుతోంది.
లక్షలాది మంది వినియోగదారుల సమాచారం లీక్ అయిందని, అందులో వారి పేరు, చిరునామా, ఫోన్ నంబర్ తదితరాలు ఉన్నాయని ఓ ఆన్లైన్ సంస్థ తన నివేదికలో పేర్కొంది. అయితే ఎటువంటి సున్నితమైన సమాచారం లేదా పాస్వర్డ్లు భద్రంగా ఉన్నాయని డెల్ పేర్కొంది. హానికరమైన మార్గాల ద్వారా డేటాను యాక్సెస్ చేసిన ‘అధికారిక విక్రేత’ కారణంగా హ్యాకింగ్ జరిగి డేటా లీక్ అయ్యిందని టెక్ కంపెనీ తెలిపింది.
డెల్ ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. విక్రేతతో దాని ఒప్పందాన్ని రద్దు చేసింది. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి సున్నితమైన డేటా ఏదీ దొంగిలించబడలేదని స్పష్టం చేసింది. అయితే దీని కారణంగా వారు ఇతర స్కామ్లకు గురవుతారని లేదా బాధితులుగా మారవచ్చని కంపెనీ తెలిపింది. ఇది కాకుండా, బాధిత వినియోగదారులకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కంపెనీ ఈ-మెయిల్లను పంపుతోంది.
తమ సమాచారాన్ని రక్షించుకోవడానికి అదనపు చర్యలు తీసుకోవాలని టెక్ కంపెనీ వినియోగదారులకు సూచించింది. వీటిలో బలమైన పాస్వర్డ్లను ఉపయోగించడం, మీ ఖాతా గురించి అప్రమత్తంగా ఉండటం, ఏదైనా అనుమానాస్పద కార్యాచరణను నివేదించడం వంటి అంశాలు ఉంటాయి. తమ కస్టమర్ల సమాచార భద్రత విషయంలో తాము సీరియస్గా ఉన్నామని, తమ భద్రతా వ్యవస్థలను బలోపేతం చేస్తామని డెల్ తెలిపింది. దీని కోసం డెల్ కంపెనీ ఒక సపోర్టు పేజీని కూడా సృష్టించింది. ఇక్కడ కస్టమర్లు మరింత సమాచారాన్ని పొందవచ్చు. డేటా లీక్కు సంబంధించిన ప్రశ్నలకు వారు సమాధానాలను పొందొచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..