
ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ రంగంలో కీలక పరిణామంగా ఆంత్రోపిక్ తన కొత్త AI మోడల్ ‘క్లాడ్ మిథోస్ ప్రివ్యూ’ను తీసుకొచ్చింది. కంపెనీ ప్రకారం ఇది ఇప్పటివరకు అభివృద్ధి చేసిన అత్యంత శక్తివంతమైన మోడల్గా నిలిచింది. అయితే దీనిలోని అసాధారణ సామర్థ్యాలు సైబర్ భద్రతా ప్రమాదాలను పెంచే అవకాశముండటంతో, ప్రజలకు విడుదలను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సంస్థ వెల్లడించింది. సీఈఓ డారియో అమోడెయ్ నేతృత్వంలోని బృందం తెలిపిన వివరాల ప్రకారం.. ఈ మోడల్ వెబ్ బ్రౌజర్లు, ఆపరేటింగ్ సిస్టమ్లు, సర్వర్లలో వేలాది ‘జీరో-డే’ బలహీనతలను గుర్తించే సామర్థ్యం కలిగి ఉంది.
ఇవి సాఫ్ట్వేర్ తయారీదారులకు తెలియని లోపాలు కావడంతో, దుర్వినియోగం జరిగితే పెద్ద స్థాయి సైబర్ దాడులకు దారి తీసే ప్రమాదం ఉంది. ప్రత్యేకంగా OpenBSDలో 27 ఏళ్ల పాత లోపం, అలాగే లినక్స్ కెర్నల్లో అనేక భద్రతా సమస్యలను ఈ మోడల్ గుర్తించినట్లు వెల్లడైంది. ఈ లోపాల ద్వారా సాధారణ యూజర్ యాక్సెస్ నుండి పూర్తిస్థాయి సిస్టమ్ నియంత్రణకు దాడిదారులు చేరుకునే అవకాశముందని కంపెనీ హెచ్చరించింది.
ఈ పరిస్థితుల్లో మోడల్ను నేరుగా విడుదల చేయకుండా, ఆంత్రోపిక్ ‘ప్రాజెక్ట్ గ్లాస్వింగ్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని కింద యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వెబ్ సిరీస్ వంటి ప్రధాన టెక్ సంస్థలతో కలిసి పనిచేస్తూ, గుర్తించిన లోపాలను సరిదిద్దే చర్యలు తీసుకుంటోంది. ఈ ప్రాజెక్ట్కు మద్దతుగా సంస్థ 100 మిలియన్ డాలర్ల వరకు వినియోగ క్రెడిట్లను కేటాయించింది. అదనపు వినియోగానికి భాగస్వామ్య సంస్థలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా డారియో అమోడెయ్ మాట్లాడుతూ.. ఈ టెక్నాలజీని సరైన విధంగా అమలు చేస్తే, మరింత సురక్షితమైన డిజిటల్ ప్రపంచాన్ని సృష్టించే అవకాశం ఉంది. కానీ తప్పుగా ఉపయోగిస్తే ప్రమాదాలు తీవ్రమవుతాయి అని హెచ్చరించారు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి