Yashasvi Jaiswal: టీమ్‌ మారాలని డిసైడ్‌ అయిపోయన జైస్వాల్‌! ఇంత షాకింగ్‌ నిర్ణయం ఎందుకంటే..?

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడుతున్న యువ క్రికెటర్‌ యశస్వి జైస్వాల్, డొమెస్టిక్ క్రికెట్‌లో ముంబై నుంచి గోవాకు మారాలని నిర్ణయించుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో ఈ మార్పు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు మెయిల్ పంపినట్లు సమాచారం. గతంలో అర్జున్ టెండూల్కర్, సిద్దేశ్‌లు కూడా ముంబై నుండి గోవాకు మారారు.

Yashasvi Jaiswal: టీమ్‌ మారాలని డిసైడ్‌ అయిపోయన జైస్వాల్‌! ఇంత షాకింగ్‌ నిర్ణయం ఎందుకంటే..?
Yashasvi Jaiswal

Updated on: Apr 02, 2025 | 4:48 PM

టీమిండియా యంగ్‌స్టర్‌ యశస్వి జైస్వాల్‌ ప్రస్తుతం ఐపీఎల్‌తో బిజీగా ఉన్నాడు. రాజస్థాన్‌ రాయల్స్‌ టీమ్‌లో ఓపెనర్‌గా ఆడుతున్న ఈ యంగ్‌ టాలెంటెడ్‌ బ్యాటర్‌.. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు బ్లాస్టింగ్‌ ఇన్నింగ్స్ ఆడలేదు. రానున్న మ్యాచ్‌ల్లో అతని నుంచి ఓ పవర్‌ ఫుల్‌ ఇన్నింగ్స్‌ను ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు క్రికెట్‌ అభిమానులు. ఈ క్రమంలో జైస్వాల్ ఓ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నాడు. ఒక టీమ్‌ నుంచి మరో టీమ్‌కు మారాలని డిసైడ్‌ అయ్యాడు అందుకోసం ఇప్పటికే ఒక రిక్వెస్ట్‌ కూడా పెట్టుకున్నాడు.

అయితే అది ఐపీఎల్‌లో కాదులేండి, డొమెస్టిక్‌ క్రికెట్‌లో. ప్రస్తుతం దేశవాళి క్రికెట్‌లో ముంబై జట్టుకు ఆడుతున్న జైస్వాల్‌.. వచ్చే డొమెస్టిక్‌ సెషన్‌లో గోవా జట్టుకు ఆడాలని అనుకుంటున్నాడు. ఈ విషయమై ఇప్పటికే ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌కు ఒక మెయిల్‌ కూడా పంపినట్లు సమాచారం. తాను డొమెస్టిక్‌ సెషన్‌లో గోవాకు ఆడాలని అనుకుంటున్నట్లు, అందుకోసం తనకు అనుమతి ఇవ్వాలని కూడా ఎంసీఏను జైస్వాల్‌ కోరినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఎంసీఏ ప్రతినిధి కూడా ధృవీకరించారు.

జైస్వాల్‌ మెయిల్‌ పంపినట్లు ఆయన వెల్లడించారు. కాగా, ముంబైని కాదని, జైస్వాల్‌ గోవాకు ఎందుకు ఆడాలని అనుకుంటున్నాడనే ప్రశ్నకు ఎంసీఏ ప్రతినిధి పూర్తి సమాధానం చెప్పలేదు. మెయిల్‌లో వ్యక్తిగత కారణాల వల్ల తాను గోవాకు మారాలని అనుకుంటున్నట్లు జైస్వాల్‌ వెల్లడించాలని మాత్రమే తెలిపారు. కాగా గతంలో సచిన్‌ టెండూల్కర్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌, సిద్దేశ్‌ సైతం ముంబైను వీడి గోవా స్టేట్‌టీమ్‌కు ఆడిన విషయం తెలిసిందే. ఒక వేళ ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ ఒప్పుకుంటే.. గోవాకు ఆడే మూడో ముంబై ప్లేయర్‌గా జైస్వాల్‌ నిలుస్తాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.