
టీమిండియాకు కొత్త టీ20 కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ ఎంపికైన విషయం తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ 2026 గెలిచిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్సీ, టీమ్ నుంచి తప్పిస్తూ అతని స్థానంలో అయ్యర్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. అయితే బీసీసీఐ, సెలెక్టర్లు తీసుకున్న ఈ నిర్ణయంపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మండిపడ్డారు. శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్నప్పటికీ, దీర్ఘకాలికంగా భారత టీ20 జట్టుకు నాయకత్వం వహించే అర్హతలు శుబ్మన్ గిల్కే ఎక్కువగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
భారత సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ శనివారం శ్రేయస్ అయ్యర్ను భారత టీ20 జట్టు కెప్టెన్గా ప్రకటించిన అనంతరం మంజ్రేకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి కాలంలో శ్రేయస్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ తరఫున దాదాపు 500 పరుగులు సాధించాడు. అంతకుముందు కేకేఆర్ తరఫున కెప్టెన్గా టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించగా, తర్వాత పంజాబ్ కింగ్స్ను కూడా ఫైనల్ వరకు నడిపించాడు. దేశీయ క్రికెట్లోనూ, అంతర్జాతీయ వేదికలపైనా నిలకడైన ప్రదర్శనలతో తిరిగి భారత జట్టులో తన స్థానాన్ని బలపరుచుకున్నాడు.
అయితే మంజ్రేకర్ అభిప్రాయం ప్రకారం.. భవిష్యత్తు టీ20 ప్రపంచకప్లు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి సవాళ్లతో కూడిన వేదికల్లో జరగనున్న నేపథ్యంలో, అన్ని పరిస్థితుల్లో రాణించగల సాంకేతిక సామర్థ్యం గిల్కు ఉందన్నారు. ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్కు నాయకత్వం వహించిన గిల్ 732 పరుగులు చేసి జట్టును ఫైనల్కు చేర్చాడు. అతని కన్సిస్టెన్సీ, లీడర్ షిప్ క్వాలిటీస్, ఒత్తిడిలో ఆడే తీరు భవిష్యత్తు కెప్టెన్గా అతడిని బలమైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయని మంజ్రేకర్ పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం భారత టీ20 జట్టులో ఓపెనింగ్ స్థానాల కోసం తీవ్ర పోటీ నెలకొనడం గిల్కు ప్రతికూలంగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఓపెనర్లతో పాటు యువ సంచలనం వైభవ్ సూర్యవన్షీ కూడా జట్టులో ఉండటంతో, తుది జట్టులో గిల్కు స్థానం కల్పించడం కష్టంగా మారిందన్నాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి