
Bangladesh Women: బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టులో ఒక్కసారిగా పెను ప్రకంపనలు రేగాయి. ఆసియా క్రీడల ముగిసిన వెంటనే బంగ్లాదేశ్ టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ఆ జట్టు స్టార్ ఆటగాడు, కెప్టెన్ నిగర్ సుల్తానా సంచలన ప్రకటన చేశారు. ఆమె తీసుకున్న ఈ హఠాత్ నిర్ణయం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) అధికారులను సైతం నివ్వెరపోయేలా చేసింది. అసలు ఆమె ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారనే విషయంపై బోర్డు పెద్దలకు కూడా ఎలాంటి ముందస్తు సమాచారం లేకపోవడం గమనార్హం.
బుధవారం బంగ్లాదేశ్ మహిళా వింగ్ చైర్మన్ రఫికుల్ ఇస్లాం బాబు మాట్లాడుతూ.. నిగర్ సుల్తానా తన రాజీనామా నిర్ణయాన్ని ఈ-మెయిల్ ద్వారా బోర్డుకు తెలియజేసినట్లు వెల్లడించారు. “ఆమె అకస్మాత్తుగా కెప్టెన్సీ వదిలేయడానికి అసలు కారణం ఏమిటో నాకు నిజంగా తెలియదు” అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఆసియా క్రీడల నుంచి జాతీయ జట్టు స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, భవిష్యత్ ప్రణాళికలపై బీసీబీ అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్తో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
కెప్టెన్సీ వదలడానికి అసలు కారణం ఇదేనా?
నిగర్ సుల్తానా తన బ్యాటింగ్, వికెట్ కీపింగ్ నైపుణ్యాలపై మరింతగా దృష్టి పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికి, కేవలం 50 ఓవర్ల ఫార్మాట్ (వన్డేల)పై మాత్రమే తన పూర్తి ఫోకస్ పెట్టాలని ఆమె కోరుకుంటున్నట్లు రఫికుల్ ఇస్లాం బాబు వెల్లడించారు. 2022 నుంచి బంగ్లాదేశ్ టీ20 జట్టుకు కెప్టెన్ గా వ్యవరిస్తున్న నిగర్ సుల్తానా.. మొత్తం 80 మ్యాచ్లలో జట్టును నడిపించారు. ఇందులో 32 మ్యాచ్లలో విజయం సాధించగా, 47 మ్యాచ్లలో ఓటమి చవిచూశారు. ఆమె బంగ్లాదేశ్ టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత అనుభవజ్ఞురాలైన కెప్టెన్గా నిలిచారు.
సెమీఫైనల్కు దూసుకెళ్లిన బంగ్లాదేశ్
ప్రస్తుతం జరుగుతున్న ఆసియా క్రీడల్లో బంగ్లాదేశ్ మహిళా జట్టు సెమీఫైనల్స్ దిశగా అడుగులు వేసింది. చైనాతో జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయినప్పటికీ మెరుగైన ర్యాకింగ్స్ ఆధారంగా బంగ్లాదేశ్ నేరుగా సెమీస్లోకి ప్రవేశించింది. అయితే 2023 అక్టోబర్ తర్వాత బంగ్లాదేశ్ జట్టు ఒక్క ద్వైపాక్షిక టీ20 సిరీస్ను కూడా గెలవలేకపోవడం గమనార్హం. నిగర్ సుల్తానా కెప్టెన్సీ ప్రయాణం ఒడిదుడుకులతో సాగినప్పటికీ, జట్టు కోసం ఆమె చేసిన సేవలు ఎంతో కీలకమైనవి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..