
India vs Pakistan: ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్ చేతిలో ఓటమి పాలైన తర్వాత, పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా భారత జట్టుపై, ముఖ్యంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (SKY) పై సంచలన ఆరోపణలు చేశారు. టోర్నమెంట్లో భారత్ తమతో కరచాలనం చేయకుండా క్రికెట్ను అగౌరవపరిచిందని ఆఘా వ్యాఖ్యానించారు.

మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో సల్మాన్ ఆఘా మాట్లాడుతూ, "టోర్నమెంట్ ప్రారంభంలో సూర్యకుమార్ యాదవ్ నాతో వ్యక్తిగతంగా కరచాలనం చేశారు. టోర్నమెంట్కు ముందు జరిగిన కెప్టెన్ల ప్రెస్ కాన్ఫరెన్స్లో, రిఫరీల సమావేశంలో కూడా కరచాలనం చేశారు. కానీ కెమెరాలు ఉన్నప్పుడు, వారు మాతో కరచాలనం చేయరు" అని పేర్కొన్నారు.

"తనకు ఇచ్చిన ఆదేశాలను అతను (సూర్యకుమార్) పాటిస్తున్నాడని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. కానీ, తన సొంత నిర్ణయం అయితే, అతను నాతో కరచాలనం చేసేవాడు," అని ఆఘా తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

భారత జట్టు వ్యవహరించిన తీరుపై పాకిస్తాన్ కెప్టెన్ తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. "ఈ టోర్నమెంట్లో భారత్ చేసిన పని చాలా నిరాశపరిచింది. వారు మాతో కరచాలనం చేయకపోవడం ద్వారా మమ్మల్ని కాదు, క్రికెట్ను అగౌరవపరుస్తున్నారు. మంచి జట్లు ఈ రోజు వారు చేసినట్లు చేయవు" అని ఆఘా విమర్శించారు.

తమ జట్టు బాధ్యతలను నిర్వర్తించడానికి తామే ట్రోఫీతో ఫొటో దిగామని, పతకాలు తీసుకున్నామని ఆయన చెప్పారు. ఇది చాలా అగౌరవంగా ఉందని, ఇలాంటివి ఆపాలని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఫైనల్ మ్యాచ్ తర్వాత జరిగిన ట్రోఫీ ప్రెజెంటేషన్ వేడుకలో ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వి (పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఛైర్మన్ కూడా) చేతుల మీదుగా ట్రోఫీని తీసుకోవడానికి భారత జట్టు నిరాకరించడం ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. అయితే, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) కార్యదర్శి దేవ్జీత్ సైకియా స్పందిస్తూ, పాకిస్తాన్కు చెందిన ప్రముఖ నాయకుడి నుంచి తాము ట్రోఫీని తీసుకోకూడదని నిర్ణయించుకున్నామని వివరించారు. ఈ పరిణామాలు క్రికెట్ అభిమానుల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.