
Duleep Trophy 2026: చెన్నైలోని ప్రసిద్ధ ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ఈస్ట్ జోన్, సౌత్ జోన్ మధ్య ఫైనల్ సమరం సెప్టెంబర్ 6 నుంచి 10 వరకు జరుగుతోంది. మైదానంలో ఆటగాళ్లు ట్రోఫీ కోసం చెమటోడుస్తుండగా క్రికెట్ అభిమానులు ఈ ప్రతిష్టాత్మక టోర్నీ విజేతకు దక్కే ప్రైజ్ మనీ వివరాలపై ఆరా తీస్తున్నారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం దులీప్ ట్రోఫీ విజేతగా నిలిచే జట్టు రూ.కోటి నగదు బహుమతిని గెలుచుకుంటుంది. టైటిల్ పోరులో రన్నరప్గా నిలిచే జట్టు కూడా ఖాళీ చేతులతో తిరిగి వెళ్లాల్సిన పనిలేదు. ఫైనల్లో ఓడిన జట్టుకు రూ.50 లక్షల బహుమతి లభిస్తుంది.
ఆటగాళ్లకు ప్రైజ్ మనీ పంపిణీ ఎలా?
అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. బోర్డు అందించే రూ.కోటి ప్రైజ్ మనీ కేవలం కెప్టెన్కు లేదా ఒకే ఒక్క ఆటగాడికి పరిమితం కాదు. ఇది మొత్తం విజేత జట్టుకు దక్కే ఉమ్మడి నజరానా. నిబంధనల ప్రకారం ఈ బహుమతి మొత్తాన్ని జట్టులోని ఆటగాళ్లు, సపోర్టింగ్ స్టాఫ్, కోచింగ్ బృందం మధ్య నిర్ణీత నిష్పత్తిలో పంపిణీ చేస్తారు.
మూడేళ్ల క్రితం ప్రైజ్ మనీలో పెను మార్పు
ఒకప్పుడు దేశవాళీ క్రికెట్లో విజేతలకు ఇచ్చే బహుమతి మొత్తం చాలా తక్కువగా ఉండేది. బీసీసీఐ 2023 సంవత్సరంలో డొమెస్టిక్ క్రికెట్ ప్రైజ్ మనీ సిస్టమ్ లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. దులీప్ ట్రోఫీ విజేతకు ఇచ్చే మొత్తాన్ని రూ.40 లక్షల నుంచి ఏకంగా రూ.కోటికి పెంచింది. అలాగే రన్నరప్ జట్టుకు ఇచ్చే బహుమతిని రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మార్పు వల్ల దేశవాళీ ప్లేయర్లకు ఆర్థికంగా గొప్ప మద్దతు లభించింది.
డబుల్ సెంచరీతో మెరిసిన ఈషాన్ కిషన్
ఫైనల్ పోరులో ఈస్ట్ జోన్ జట్టుకు వికెట్ కీపర్ బ్యాటర్ ఈషాన్ కిషన్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. కెప్టెన్సీ బాధ్యతలతో పాటు బ్యాట్తో కూడా అతను విరుచుకుపడ్డాడు. ఏకంగా 334 బంతులు ఎదుర్కొన్న ఈషాన్ 30 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 270 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడి జట్టును స్ట్రాంగ్ పొజిషన్లో నిలబెట్టాడు. దాదాపు రెండు రోజుల పాటు క్రీజులో పాతుకుపోయి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ఈస్ట్ జోన్, సౌత్ జోన్ జట్లలో ఏ జట్టు ఛాంపియన్గా నిలిచి మెరిసే ట్రోఫీతో పాటు రూ.కోటి సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..