
ICC Tournaments: ఐసీసీ ట్రోఫీని అందుకోవాలని ప్రతీ టీమ్ కోరుకుంటుంది. కానీ, కొన్ని టీంలకు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇప్పటి వరకు కొన్ని జట్లు ఐసీసీ ట్రోఫీలు గెలుచుకోగా, మరికొన్నింటికి అందకుండానే పోతోంది. ఆఫ్ఘనిస్తాన్, జింబాంబ్వే , బంగ్లాదేశ్ లాంటి చిన్న జట్లు ఒక్క టైటిల్ కూడా ఇప్పటి వరకు గెలవలేదు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన తొలి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2021 టైటిల్ను ఎట్టకేలకు కివీస్ ముద్దాడింది. దీంతో కివీస్ ఖాతాలో ఓ పెద్ద ఐసీసీ ట్రోఫీ చేరింది. గత ఏడేళ్లలో జరిగిన ఐసీసీ టోర్నీల్లో ప్రతిసారి కొత్త జట్టు విజేతగా నిలివడం ఆనవాయితీగా వస్తోంది. ఆ వివరాలను చూద్దాం.

2013 ఛాంపియన్స్ ట్రోఫీ: ఇంగ్లండ్లో జరిగిన 2013 ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా గెలుచుకుంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన ఆఖరి పోరులో భారత్, ఇంగ్లండ్ తలపడ్డాయి. వర్షం కారణంగా మ్యాచ్ను 20 ఓవర్లకు తగ్గించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ధోనీసేన 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు మాత్రమే చేయగలిగింది. 130 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 124 పరుగులే సాధించింది. దీంతో 5 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది.

2014 టీ20 ప్రపంచకప్: ఫైనల్లో భారత్, శ్రీలంక జట్లు తలపడ్డాయి. ఢాకాలో జరిగిన ఆఖరి మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన లంక 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

2015 వన్డే ప్రపంచకప్: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఆఖరి పోరులో ఆస్ట్రేలియా విజయం సాధించింది. మెల్బోర్న్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 45 ఓవర్లలో 183 రన్స్ చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆసీసీ కేవలం 33.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేరి ట్రోఫీని ముద్దాడింది. వీటితోపాటు 1987, 1999, 2003, 2007 సంవత్సరాలలో వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో కంగారుల జట్టే విజేతగా నిలిచింది.

2016 టీ20 ప్రపంచకప్: భారత్లో జరిగిన 2016 టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆఖరి పోరులో ఇంగ్లండ్, వెస్టిండీస్ టీంలు పోటీపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరేబియన్ జట్టు మరో రెండు బంతులు ఉండగానే లక్ష్యాన్ని సాధించి ట్రోఫీని గెలుచుకుంది.

2017 ఛాంపియన్స్ ట్రోఫీ: భారత్, పాకిస్థాన్ జట్లు ట్రోపీ కోసం ఆఖరి పోరులో తలపడ్డాయి. అప్పటి వరకు అన్ని మ్యాచుల్లో దుమ్మురేపిన విరాట్ కోహ్లీసేన.. పాకిస్తాన్ తో జరిగిన ఫైనల్లో మాత్రం బోల్తాపడింది. 180 పరుగుల భారీ తేడాతో పాక్ జట్టు విజయం సాధించి విజేతగా నిలిచింది.

2019 వన్డే ప్రపంచకప్: ఫైనల్లో న్యూజిలాండ్తో ఇంగ్లండ్ తలపడింది. స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారి తీసింది. అక్కడ కూడా టై కావడంతో బౌండరీల సంఖ్య ఆధారంగా ఇంగ్లండ్ జట్టు విజేతగా నిలిచింది.